ఏపీలో అందరూ కరోనా బారిన పడే అవకాశం – సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలా నెమ్మదిగా ఉంది అనుకున్న కరోనా ఇటీవల వేగం పెంచింది. రెండు మూడు రోజులు రోజుకు రెండున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కరోనాపై మరోమారు స్పందించారు.

రాబోయే రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. అయినా భయం వద్దని, సీరియస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, 85 శాతం మందికి ఇంటివద్దే కరోనా నయం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు సరిహద్దులు తెరిచి ఉంచాయి. అందువల్ల రాకపోకలను మనం ఆపలేం. రాకపోకల వల్ల కరోనా కేసుల పెరుగుదలను కూడా ఆపలేం అన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని, చికిత్స సదుపాయాలను ఎప్పటికపుడు మానిటర్ చేయాలని సూచించారు.

ఇక రాష్ట్రంలో మొత్తం 38,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 492 మంది ఇప్పటివరకు మరణించారు. ప్రభుత్వం విపరీతంగా టెస్టులు చేశాం అని చెబుతున్నా… కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇక ప్రజల మీదే భారం వేసినట్టు అనిపిస్తున్నాయి.

నిన్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘మన చేతుల్లో ఏం లేదు, దేవుడి మీదే భారం వేశాం. ఆయనే కాపాడాలంటూ శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. దీంతో ఆయన… సాయంత్రానికి దానిపై వివరణ ఇచ్చారు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనం త్వరగా దీనిని జయిస్తామనే ఉద్దేశంతో చెప్పినట్లు వ్యాఖ్యానించారు. మరి జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో !