క‌విత ఇంట్లో సీబీఐ

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తెలంగాణ సీఎం కుమార్తె క‌విత పేరు కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె అనుమ‌తి మేర‌కు తాజాగా.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. హైద‌రాబాద్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. రెండు బృందాలుగా వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు.

సీఆర్‌పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశముంది. ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా… ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు.

దీంతో సీబీఐ ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇవాళ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. మరోవైపు ఆమె శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది.

రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా… అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.