మోడీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా కేజ్రీవాల్‌?

దేశ రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తి క‌నిపిస్తోందా? ఒక‌ప్పుడు ఒంటి చేత్తో.. ఢిల్లీలో రాజ‌కీయాలు చేసిన‌.. నేత‌.. ఇప్పుడు దేశ శ‌క్తిగా మారే ప‌రిస్థితి నెమ్మ‌దిగా ఏర్ప‌డుతోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి స‌రితూగ‌గ‌ల నాయ‌కుడు లేడంటూ..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన విశ్లేష‌ణ‌లు తిరుగు ట‌పా క‌డుతున్నాయి. మోడీకి ప్ర‌త్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

జాతీయ మీడియా చూపు ఇప్పుడు ఆప్‌పై ప‌డిందంటే ఆశ్చ‌ర్యం కాదు.. అలుపెరుగ‌ని కృషి క‌నిపిస్తోంది. అవినీతిపై యుద్ధంలో అన్నాహ‌జారే తో క‌లిసి..లోక్‌పాల్ కోసం ఉద్య‌మించిన చిన్న నాయ‌కుడు కేజ్రీవాల్‌. అప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఐఆర్ ఎస్ ఉద్యోగిగా ఉన్న ఆయ‌న‌.. అనంత‌రం ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్య‌మ బాట ప‌ట్టారు. అన్నాహ‌జారే ఉద్య‌మాన్ని వ‌దిలేసిన త‌ర్వాత‌.. కేజ్రీవాల్ త‌న తోటివారిని చేర‌దీసి.. రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు.

అనేక ఒడిదుడుకులు, విమ‌ర్శ‌లు త‌ట్టుకుని.. ఢిల్లీలో పాగా వేయ‌డం.. నిజంగానేఅప్ప‌ట్లో ఒక చ‌రిత్ర‌. అంతేనా.. త‌ర్వాత వ‌రుస‌గా రెండోసారి రాజ‌ధాని రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌డం.. అందునా, బ‌ల‌మైన బీజేపీని, మాట‌ల మాంత్రికుడు మోడీని ఎదిరించి అధికారంలోకి రావ‌డం మ‌రో చ‌రిత్ర‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ కానీ, ఆయ‌న అనుకూల నేత‌లుగానీ.. దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్నారంటే.. అందునా బ‌లంగా ఉన్నారంటే ఆశ్య‌ర్యం అనిపించ‌క మాన‌దు.

పంజాబ్‌లో అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. గుజ‌రాత్‌లోనూ ఇప్పుడు బోణీ కొట్టింది. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆప్ నేత‌లు విజ‌యం దక్కించుకున్నారు. అయితే, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆప్ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోయినా.. డిపాజిట్లు అయితే కోల్పోయే ప‌రిస్థితి లేదు. మొత్తంగా చూస్తే.. ఒక్క ద‌క్షిణాదిలో త‌ప్ప‌..ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఆప్ బ‌లంగా విస్త‌రించ‌డం.. కేజ్రీవాల్ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. తాజాగా ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 15 ఏళ్ల బీజేపీ పాల‌న‌ను ప‌క్కన పెట్టి ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చారు.

ఇదేమీ చిన్న విజ‌యం కాదు. కేంద్రంలో ఉన్న ఒక బ‌ల‌మైన అధికార పార్టీని తోసిరాజ‌ని.. ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డం. అదే స‌మ‌యంలో లిక్క‌ర్ కుంభ‌కోణంలో త‌న సొంత మంత్రినే అరెస్టు చేసే ప్ర‌య‌త్నం వ‌ర‌కు రావ‌డం.. అడుగ‌డుగునా.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అడ్డంకులు ఇలా ఎన్నో విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌ను మెప్పించిన కేజ్రీవాల్‌కు ఇప్పుడు దేశాన్ని మెప్పించ‌డంపెద్ద స‌మ‌స్య కాద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

మారుతున్న ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌డంలోనూ.. అవినీతి ర‌హిత పాల‌నపై త‌న‌దైన ముద్ర వేయ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. అయితే, కొంత స‌మ‌యం ప‌ట్టినా.. ఆయ‌నే మోడీకి ప్ర‌త్యామ్నా యమ‌నే వాద‌న‌ను మాత్రం ఎవ‌రూ తోసిపుచ్చ‌లేని వాస్త‌వం. ఆదిశ‌గా కేజ్రీవాల్ కూడా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు.