ఒంట‌రి అయిపోతున్న కేసీఆర్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పరిస్థితి ఏంటి? జాతీయ రాజ‌కీయాలుచేస్తానంటూ.. దేశం చుట్టేసిన నాయ‌కుడు.. ఇప్పుడు ఒంట‌రి అవుతున్నారా? మోడీపై క‌య్యానికి కాలుదువ్వినా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన ప‌రిణామాలు కానీ, ప‌రిస్థితులుకానీ క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ద‌క్షిణాదిలో క‌ర్ణాట‌క నుంచి మాత్ర‌మే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఇప్పుడు అది కూడా ల‌భించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. కేంద్రంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదించిన వారు త‌న‌ను క‌లుపుకొని పోతార‌ని, త‌ను గీసిన గీత దాట‌ర‌ని అనుకున్న కేసీఆర్‌కు వారంతా హ్యాండిచ్చే ప‌రిస్థితి కూడా ఉత్ప‌న్న‌మైంది. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకానీ, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్ కానీ, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కానీ.. ఇలా చాలా మంది మోడీకి విధేయులుగా మారిపోయారు. కార‌ణాలు ఏవైనా కావొచ్చు.. ప‌రిస్థితి ఏదైనా రావొచ్చు.. నాయ‌కులు మాత్రం మోడీ ప‌ట్ల విధేయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇక‌, ఈ ప‌రిణామాల‌కు తోడు.. బిహార్‌లో నిన్న‌టి వ‌ర‌కు మోడీని విమ‌ర్శించిన అక్క‌డి నాయ‌కులు.. కూడా ఇప్పుడు మోడీ వైపు చూసే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కూడా అంత‌ర్గ‌త కార‌ణాలు చాలానే ఉన్నాయి. ఇక‌, క‌శ్మీర్ విష‌యంలో మోడీ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టిన వారు కూడా ఇప్పుడు ఆయ‌న బాట‌లో న‌డ‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నేరుగా వారు మోడీని ప్ర‌స్తుతించ‌క‌పో యినా.. తిట్టే సాహ‌సం అయితే చేయ‌లేక పోతున్నారు. ఇక‌, పొరుగున ఉన్న ఒడిశా సీఎం ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఆయ‌న విభేదించ‌రు.. సానుకూలంగానూ ఉండ‌రు.

మొత్తానికిఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌తో క‌లిసి వ‌చ్చే నాయ‌కులు.. ఎవ‌రు? వ‌స్తామ‌ని చెప్పిన నాయ‌కుల్లో మిగిలేది ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రో 18 నెల‌ల్లో.. దేశంలో సార్వ‌త్రిక స‌మ‌రం ప్రారంభం కానుంది. ఆ స‌మ‌యానికి 28 రాష్ట్రాల్లో ఎన్నిచోట్ల బీఆర్ఎస్ దూకుడు చూపిస్తుంది? ఎంత‌మందిని క‌లుపుకొనిపోతుంది? అనేది ఒక ప్ర‌శ్న అయితే.. కేసీఆర్ దూకుడుకు తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోనే బంధ‌నాలు వేసేలా జాతీయ‌స్తాయిలో బీజేపీ నెరుపుతున్న రాజ‌కీయ వ్యూహాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలోనే స‌మ‌య హ‌ర‌ణం అయిపోయే ప‌రిస్థితి నెల‌కొంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ ప‌రిస్థితి జాతీయ‌స్థాయిలో కొడిక‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.