ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ ఉద్యోగాలేన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. మ‌రో 40 వేల ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే ముహూర్తం పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకునే స‌రికి ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు.(ఇప్ప‌టికే ఇచ్చిన వాటితో క‌లిపి). రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన విజ‌యోత్స‌వ స‌భ‌ల్లో భాగంగా హుస్నాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

విమానం దిగి నేరుగా..

వాస్త‌వానికి బుధ‌వారం సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అనంత‌రం తెలంగాణ‌కు తిరిగి వ‌చ్చారు. వ‌స్తూ వ‌స్తూనే ఆయ‌న హుస్నాబాద్‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఇక్క‌డ నిర్వ‌హించిన విజ‌యోత్స‌వ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 260 కోట్ల రూపాయ‌ల వ్య‌యం కాగ‌ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. వీటిలో ప‌లు నీటి ప్రాజెక్టులు స‌హా ర‌హ‌దారులు కూడా ఉన్నాయి. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న యువ‌త‌కు 40 వేల ఉద్యోగాల‌ను ప్ర‌క‌టించారు.

తేడా చూడాలి!

బీఆర్ ఎస్ హ‌యాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టార‌ని.. త‌మ కాంగ్రెస్ పాల‌న‌లో ఎస్ ఆర్ ఎస్పీ నిర్మించామ‌ని.. దానికి దీనికి తేడా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అవినీతికి కేరాఫ్‌గా కాళేశ్వ‌రం నిలిచింద‌ని విమ‌ర్శించారు. త్వ‌ర‌లోనే `గౌరెల్లి` ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్న‌ట్టు చెప్పారు. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల విష‌యంలోనూ వివ‌క్ష చూపించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త‌మ త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాలైన గ‌జ్వేల్‌(కేసీఆర్‌), సిద్దిపేట‌(హ‌రీష్‌రావు), సిరిసిల్ల‌(కేటీఆర్‌) ల‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నార‌ని తెలిపారు. కానీ, హుస్నాబాద్‌లో చేప‌ట్టిన ప‌నులు మాత్రం ముందుకు సాగ‌లేద‌న్నారు. ఇవ‌న్నీ.. తాము పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.  

ఎంతో మంది త్యాగ‌ధ‌నులు..

తెలంగాణ కోసం.. ఉద్య‌మంలో పాల్గొని ఎంతో మంది త‌మ జీవితాల‌ను త్యాగం చేశార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ హుస్నాబాద్‌ నుంచే బహుజన దండు కట్టారు.“ అని రేవంత్ చెప్పారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం.. హుస్నాబాద్ ప్ర‌జ‌లు ఉవ్వెత్తున ఎగసిపడ్డార‌న్నారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. క‌రీంన‌గ‌ర్ డిక్ట‌రేష‌న్ ప్ర‌కార‌మే సోనియాగాంధీ అనేక వ‌త్తిళ్ల‌ను కూడా అధిగ‌మించి తెలంగాణ ఇచ్చార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.