వైసీపీ కొత్త టార్గెట్ ఫిక్స్

గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలతో పాటు ‘టార్గెట్ టీడీపీ’ పథకాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం అగ్ర నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కొల్లు రవీంద్ర జగన్ సర్కారు దెబ్బలు రుచిచూశారు. ఒకరు అవినీతి కేసులో, ఇంకొకరు హత్య కేసులో చిక్కుకుని అల్లాడుతున్నరు.

ఇప్పుడు అధికార పార్టీ కొత్త టార్గెట్ ఫిక్సయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వైసీపీ లక్ష్యంగా చేసుకుంది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వైకాపా అగ్రనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ వేయడం సంచలనంగా మారింది.

గంటా శ్రీనివాసరావుకు సైకిళ్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందని.. ఆయన ఆధ్వర్యంలో సైకిళ్ల పేరుతో జరిగిన రూ.12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! రూ.12 కోట్ల కొనుగోళ్ళలో రూ.5 కోట్ల అవినీతి.. ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు గంటాను వైసీపీ క్యాడర్ కూడా టార్గెట్ చేసింది. వైకాపా కార్యకర్తలు సైకిళ్ల కుంభకోణంలో గంటాపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాశారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా సీఎస్ నీలం సాహ్ని, విద్యాశాఖ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. సైకిళ్ళ కొనుగోళ్లు విషయంలో స్కామ్ జరిగిందని.. నాణ్యత లేని సైకిళ్ళు కొని దాదాపు రూ.5 కోట్ల మేర అవకతవకలు జరిగాయని.. ఆ శాఖలో ఎక్కడ చూసినా అవినీతే అని.. దాదాపు రూ.1500 కోట్ల అవినీతి మొత్తం వివరాలు బయటకు తీసే పనిలో ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో ఎస్కే బైక్స్ అనే కంపెనీ నుంచి సైకిళ్ళు కొనుగోళ్లు చేశారు. కానీ ఆ కంపెనీ నుంచి కొనవద్దు అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ లిస్ట్ చేశాయట. కానీ కమీషన్ల కోసం నాసి రకం సైకిళ్ళు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు గతంలో ఆ కంపెనీకి గుజరాత్‌లో కోర్టులు రూ.కోటి పెనాల్టీ వేసినట్లు చెబుతున్నారు.