డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే తాజా నిర్ణయం?

KCR Medical COllege

కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాడి వదిలేశారని.. ఎవరికి వారు తమ బతుకుల్ని తామే చూసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్న మాటలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. మొదట్లో బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో కరోనా విషయంలో త్వరతిగతిన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. ప్రజలకష్టాలు తగ్గలా ఆలోచించటం లేదన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది.

కేసులు పెరగకుండా కంట్రోల్ చేయటంలో కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న మాటతో పాటు.. కంటైన్మోంట్ జోన్లు ఎత్తేయటం.. ప్రైమరీ కాంటాక్టుల్ని వెతికే పనిని పక్కన పెట్టటంతో పాటు ఇలాంటి ఎన్నో అంశాల్లో కేసీఆర్ సర్కారు తీసుకునే నిర్ణయాలు సామాన్యుల్ని.. మధ్యతరగతి వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వటం.. ఆ కారణంగా భారీ బిల్లులు వేసి బాదేస్తున్న వైనం ఇప్పటికే పలు మీడియాల్లో ప్రధాన కథనాలుగా పబ్లిష్ అయ్యాయి. ప్రభుత్వ తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఉచిత వైద్యం చేయాలని నిర్ణయించారు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే వచ్చిన చెడ్డ పేరుకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా బిల్లు బాదుడు ఒక రేంజ్లో ఉంటే మరింత బద్నాం కావటం ఖాయం. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఉచిత నిర్నయాన్ని ప్రకటించినట్లుగా చెబుతున్నారు.

దీనికి మరో కారణం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. ఫ్రీ సర్వీసు అయితే ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి సైతం తోడ్పాటుగా ఉంటుందని చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టటం సాధ్యం కాని వేళ.. కనీసం వారికి సరైన వైద్యాన్ని ఉచితంగా అందించటం ద్వారా విమర్శల తీవ్రతను తగ్గించే వీలుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కరోనా విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఉచిత వైద్యం పేరుతో తమ సర్కారు కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తుందన్న విషయాన్ని తాజా నిర్ణయంతో చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి.