ఆ టీడీపీ నేతలకు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్

ఏపీని ముందస్తు ఎన్నికలు పలుకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తుకు రెడీగా ఉండాలని మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం జగన్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు ఆయన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. దీనితో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా స్పీడ్ పెంచింది. అధికార వైసీపీపై రోజువారీ విమర్శలు చేస్తోంది. అదే సమయంలో వైసీపీని ఇరుకున పెట్టేందుకు క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాదుడే బాదుడు తర్వాత ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంగా ద్వారా వైసీపీకే కాకుండా టీడీపీ శ్రేణులకు సైతం చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారనుకోవాలి.

‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం ఎనిమిది వేల పార్టీ బృందాలను నియమించారు. వీరికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. కొన్ని పాటలు కూడా దీని కోసం విడుదల చేయబోతున్నారు. ఏడెనిమిది ముఖ్య కార్యక్రమాలను ఎంపిక చేసుకుని వాటిపైనే దృష్టి పెట్టబోతున్నారు. జనంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ చర్యలన్నీ పార్టీ నేతల తీరును గమనించేందుకు ఉపయోగపడతాయని అధిష్టానం భావిస్తోంది..

టీడీపీలో చాలా మంది నేతలు నామ్ కే వాస్తే పనిచేస్తున్నారన్న ఆరోపణలు పెల్లుబికాయి. చంద్రబాబుకు కనిపించాలన్న తపన మినహా క్షేత్రస్థాయిలోకి వెళ్లి కార్యకర్తలతో మమేకం కావాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. పార్టీని గెలిపించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు నిర్వహించి బాగా డబ్బులు వెనుకేసుకున్న నేతల్లో చాలా మంది అధికారం చేజారిన తర్వాత చిత్తశుద్ధీని ప్రదర్శించడం లేదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం సామాజిక వర్గం లెక్కలు, చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని చూపించి పదవులకు కోసం క్యూ కట్టడం ఖాయం..

ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి, తర్వాత రిలాక్యయ్యే నేతలకు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇవ్వబోతున్నారు. ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వారి చొరవను బట్టే పార్టీలో వారి భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. ప్రోగ్రాం ఎంత మేర సక్సెస్ అవుతుంది. దాన్ని విజయవంతం చేయడంలో ఎవరి పాత్ర ఎంత ఉందని అంచనా వేస్తారు. ఇందుకోసం వ్యూహకర్త రాబిన్ శర్మ టీమ్ పనిచేస్తోందనుకోండి. నాయకులు ఎవరు ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించడం రాబిన్ శర్మ బృందం పనిగా చెబుతున్నారు. ఈ సారి కాగిత పులులు కాకుండా.. నిజంగా పనిచేసి జనంలో టైగర్ అనిపించుకున్న వారికే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ ప్రోగ్రాంను సక్సెస్ చేసిన నాయకులకు నారా లోకేష్ పాదయాత్రలో కీలకపాత్ర అప్పజెబుతారు. అలా బాధ్యతలు అందుకున్న వారిని అదృష్టవంతులుగానే భావించాలి. కోరుకున్న నియోజకవర్గాల్లో వారికి నామినేషన్ ఖాయం. లోకేష్ టీమ్ లో పర్మినెంట్ మెంబర్స్ అవుతారు. గెలిస్తే మంత్రి పదవులు దక్కడం కూడా ఖాయమనుకోవచ్చు. అందుకు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయడం మంచిదని టీడీపీ వ్యూహకర్తలు చెబుతున్నారు…