రాజ‌ధాని రైతుల బుద్ధి మారాల‌ని దేవుడిని కోరుతున్నా: జ‌గ‌న్

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల‌నేప‌థ్యంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ చాలా ఆస‌క్తిగా స్పందించారు. మ‌ద‌న‌ప‌ల్లెలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ..సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు.

‘ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి బయటపడే.. బుద్ది, జ్ఞానం రైతుల‌కు ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నా. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించే వారికి జ్ఞానం రావాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను.’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, “మనం రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు. మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడ్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. ప్రజల్ని, ఆ దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి. మంచి జరిగితే మీ జగనన్నకు తోడుగా ఉండండి’ అని సీఎం జగన్‌ ప్రజల్ని కోరారు.

చంద్ర‌బాబుపై పేలిన పంచ్‌

మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను దగా చేసి నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రజలు ‘ఇదేం ఖర్మరా బాబూ’ అనుకుంటున్నారని సీఎం జగన్‌ చెప్పారు.

జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించామ‌న్నారు.

“జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే” అని సీఎం జగన్‌ అన్నారు.

లెక్క‌లు ప‌క్కా!

అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లకు రూ.685 కోట్లు ఖర్చు చేశామ‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.. నాడు-నేడు తొలి దశకు రూ.3,669 కోట్లు, రెండో దశకు రూ.8వేల కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు.. ఇలా మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా 85వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామ‌ని సీఎం వివ‌రించారు.