వాట్ నెక్ట్స్‌.. రాజ‌ధాని పై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

ఇప్పుడు ఏం చేద్దాం.. సుప్రీం తీర్పు పై వైసీపీ డోలాయ‌మానం!

రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను నిర్మించ‌డ‌మో.. లేక ఉన్న వాటినే డెవ‌ల‌ప్ చేయ‌డ‌మో చేసి… ఎన్నిక‌ల కు ముందు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచాల‌ని అనుకుంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు పాలుపోని ప‌రిస్థితి వ‌చ్చింది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టించి వ‌చ్చే ఏడాది మార్చి నాటికి మూడేళ్లు పూర్త‌వుతు న్నాయి. 2020 మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం జ‌గ‌న్ మూడును ప్ర‌క‌టించారు. ద‌రిమిలా.. వెల్లువెత్తిన రైతుల ఆగ్ర‌హం.. న్యాయ‌స్థానాల జోక్యంతో ఇది కీల‌క‌మైన మ‌లుపు తిరిగింది.

చేసిన చ‌ట్టాల‌ను కూడా ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇంత‌లోనే హైకోర్టు.. మూడు కాదు.. ఒక‌టే అంటూ చెప్ప‌డం.. ఇక్క‌డే మూడు, ఆరు నెల‌ల్లోనే నిర్మాణం పూర్తికావాల‌న‌డం.. సంచ‌ల‌నంగా మారింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఏమైనా ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు ఆలోచించారు. హైకోర్టు పెట్టిన గ‌డువు పూర్తికావ‌డంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్ర‌భుత్వం.. రాజ‌ధాని పై చ‌ట్టం చేసే హ‌క్కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌న్న హైకోర్టు వాద‌న‌ను కొట్టేయాల‌ని కోరుకుంది.

అయితే, సుప్రీంకోర్టు దీనిని ‘త‌ర్వాత‌’ విచారిస్తామంటూ.. ముందు హైకోర్టు పెట్టిన ‘టైంబౌండ్‌’ను త‌ప్పుబ‌డుతూ.. వాటిపైనే ప్ర‌ధానంగా స్టే విధించింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికిప్పుడు హైకోర్టు చెప్పిన‌ట్టు.. అమ‌రావ‌తిలో నిర్మాణాలు, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం లేనేలేదు. అంటే.. ఇది ఒక రిలీఫ‌నే చెప్పాలి. మ‌రి.. అదే స‌మ‌యంలో తాను భావిస్తున్న మూడు రాజ‌ధానుల‌కు మాత్రం.. సుప్రీం కోర్టు నుంచి కొంచెం కూడా.. సాన‌కూల ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

దీంతో ఇప్పుడు ఏం చేయాలి? అనేది వైసీపీ అధినేత నుంచి కీల‌క నాయ‌కుల వ‌ర‌కు త‌ల‌ప‌ట్టుకు ప‌రిస్థితి వ‌చ్చింది. సుప్రీం ఇచ్చిన స్టే ఒక‌ వైపు కొంత ఆనందం క‌లిగిస్తున్నా.. మ‌రో వైపు త‌మ మూడు రాజ‌ధానుల క‌ల మాటేమిటి? అనేది ఇప్పుడు అధిష్టానాన్ని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తోంద‌నేది వాస్త‌వం. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర‌లోపే స‌మ‌యం ఉండడం.. త‌మ‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన మూడు రాజ‌ధానుల‌కు.. ఎక్క‌డా దారి క‌నిపించ‌క‌పోవ‌డం.. చిత్ర‌మైన వాతావ‌ర‌ణంగానే వైసీపీ కీల‌క నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్ప‌టికిప్పుడు రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకు వెళ్లాల‌నే విష‌యంపై వైసీపీ ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై సీనియ‌ర్ న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి.. విశాఖ‌కు త‌క్ష‌ణ‌మే అంటే.. వ‌చ్చే జ‌న‌వ‌రి 31లోపు సీఎం కార్యాల‌యాన్ని త‌ర‌లించేస్తే.. ఎలా ఉంటుంది? ఏమైనా చిక్కులు వ‌స్తాయా? అనే దానిపై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. రాబోయే 60 రోజుల్లో ఏదో ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం అయితే.. తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.