ముద్రగడ అస్త్రసన్యాసం.. పవనే రథసారధా?

Mudragada

ఏపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కారణం ఏమైనా కానీ కాపుల ఉద్యమనేత.. నిత్యం మా జాతి.. మా జాతి అంటూ కాపుల గురించి వివిధ వేదికల మీద ఓపెన్ మీద మాట్లాడే అతి కొద్ది మంది నేతల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు.

వివిధ పార్టీల్లో కాపు నేతలు చాలామంది ఉన్నా.. తమ సామాజిక వర్గాన్ని అందరికి చెప్పుకుంటూ.. వారి ప్రయోజనాల కోసం పాటుపడతానని చెప్పే నేతల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వారందరికి భిన్నంగా ముద్రగడ తీరు భిన్నమని చెప్పాలి. ఒకప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పి.. తర్వాత కాపు జాతి శ్రేయస్సు కోసం మాత్రమే గళం విప్పే ఆయన.. విభజన తర్వాత ఎంత యాక్టివ్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాపులను బీసీ హోదా ఇవ్వాలంటూ ఆయన చేపట్టిన ఉద్యమం.. చేసిన ఆమరణదీక్ష నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎంతలా ముచ్చమటలు పోయించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ను ఎలా బుజ్జగించాలో అర్థం కాక బాబు ప్రభుత్వం కిందామీదా పడింది. సుదీర్ఘకాలంగా తమకు అన్యాయం జరిగిందని.. ఏ రాజకీయ పార్టీ తమనుపట్టించుకోవటం లేదన్న కోపంతో ఉన్న కాపులు.. బాబు ప్రభుత్వంపై ఒంటి కాలి మీద లేచేశారు.

కులాలకు సంబంధం లేకుండా తెలుగు ప్రజల్లో తనకుంటూ క్రేజ్ సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి మరోలా ఉండేది. ఆయనకు మొదట్నించి కులాలు.. మతాలు లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. తానొక విశ్వమానవుడిలా ఫీల్ అవుతుంటారు. లోపల తన జాతి జనుల మీద కాస్త అభిమానం ఉన్నా.. దాన్ని బయటపెట్టేవాళ్లు కాదు. అక్కడితో ఆగకుండా తాను కాపులకు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండదన్న మాట ఆయన నోటి వినిపించేది.

ఇంత ఓపెన్ గా పవన్ చెప్పేయటం ఆ వర్గానికి చెందిన కొందరికి గుర్రుగా ఉండేది. అలా అని ప్రజాదరణ ఉన్న తమ వర్గానికి చెందిన నేతపై విమర్శలు చేయటం సరికాదన్న ఉద్దేశంతో మౌనంగా ఉండేవారు. ఏపీలో బలమైన ఓటు బ్యాంకు ఉండటమే కాదు.. ఐక్యతతో వ్యవహరిస్తే అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశం లేకపోలేదు.

కాకుంటే.. స్థానికంగా ఉండే సమస్యలతో పాటు.. మిగిలిన సామాజిక వర్గాలతో పోలిస్తే.. కాపు ఓటుబ్యాంకు సమీకరణంగా లేదన్న విమర్శ ఉండేది. ఎవరికి వారుగా చెల్లాచెదురైన తమ వర్గాన్ని ఒకటిగా చేసే శక్తి ఉన్న అధినేత ఎవరూ లేరన్న వేదన ఆ వర్గానికి చెందిన వారిలో తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అలా అని..ఎవరైనా ముందుకు వచ్చిన క్షణంలోనే వారికి చాటలు కట్టేసి.. మిగిలిన వారికి దూరం చేసే ప్రక్రియ కొన్ని దశాబ్దాలుగా విజయవంతంగా జరిగేది. దీంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు స్వతహాగా పైకి వచ్చినా.. కులానికి సంబంధించి పరిమితులు ఎక్కువగా ఉండేవి.

ఒకవేళ సామాజికంగా హైలెట్ అయితే.. మిగిలిన వర్గాల వారు వారిని పక్కన పెట్టేయటమో.. వారిని అణగదొక్కే ప్రయత్నం చేసేవారు. ఇలా పలువురి విషయంలో వ్యవహరించటంతో ఎవరూ తమ సామాజిక వర్గం ఆధారంగా రాజకీయాల్లో ఎదగాలన్న తలంపు ఉండేది కాదు. ఇలాంటి వాదనలకు భిన్నంగా ముద్రగడ వ్యవహరించేవారు.

అలాంటి ఆయన ఇప్పుడు కాపు ఉద్యమాన్ని వదిలేసి.. అస్త్రసన్యాసం చేసినట్లుగా ఒప్పుసేకున్నారు. ఇలాంటి వేళ.. కాపుల పరిస్థితి ఏమిటి? కాపు ఉద్యమం మాటేమిటి? దాని భవిష్యత్తు ఏమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ మాత్రమే పగ్గాలు స్వీకరించాలని కోరుతున్న వారు చాలామందే. ఒకవేళ.. అలాంటి పనే చేస్తే.. అంతకు మించిన తప్పు పని ఉంటుందన్నది మర్చిపోకూడదు.

ఎందుకంటే.. ఎప్పుడైతే కాపుల ఉద్యమ నేతగా రంగంలోకి దిగుతారో.. పవన్ కల్యాణ్ మిగిలిన వారికి దూరమైపోతారన్నది మర్చిపోకూడదు. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఆయన్ను కాపుల నేతగా వైఎస్ విజయవంతంగా ముద్ర వేయటాన్ని మర్చిపోలేం. ఈ ముద్ర ప్రభావం ప్రజారాజ్యం మీద పడిన వైనాన్ని ఒప్పుకు తీరాల్సిందే. మళ్లీ పవన్ కు అలాంటి పరిస్థితే ఎదురైతే..ఆయన రాజకీయ ఫ్యూచర్ కు ఇబ్బంది తప్పదు.

అందుకే..కాపుల ప్రయోజనాల మీద మిగిలిన వారిలా మాట్లాడాలే కానీ.. ప్రత్యేక ఎజెండాలా తీసుకుంటే మాత్రం అందరివాడు కావాల్సిన పవన్.. కొందరి వాడిగా పరిమితమవుతాడన్నది మర్చిపోకూడదు. ముద్రగడ అస్త్రసన్యాసం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. పవన్ తర్వాత అడుగులు ఎలా ఉంటాయన్నది ఒకటైతే.. క్రాస్ రోడ్ లో ఉన్న కాపులకు అండ ఎవరన్నది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం చెప్పే వారెవరు?