జ‌గ‌న్ స‌ర్ శ్రీకాకుళం టూర్‌.. జుట్టుపీక్కుంటున్న జ‌నాలు!

పై ఫొటో చూశారుగా! ఇది చూస్తే ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? ఏ దేశాధినేతో వ‌స్తున్నారు.. ఆయ‌న‌కు అత్యంత పటిష్ఠ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ఇలా చేస్తోంది అనుకుంటున్నారా? కానీ.. ఇది ఏపీ సీఎం కోసం చేస్తున్న ఏర్పాట్లు. ఆయ‌న ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టి .. ఎక్క‌డిక‌క్క‌డ దుకాణాలు రెండు రోజుల ముందే మూయించేసి బారికేడ్లు క‌ట్టేయించారు. పురుగును కూడా క‌ద‌ల‌నియ్య‌ని రీతిలో ఏర్పాట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్ పర్యటన అంటేనే రాష్ట్ర ప్రజల గుండెల్లో గుబులు పుడుతోంది. రెండు రోజుల ముందు నుంచే పోలీసులు సదరు పట్టణాన్ని చేతుల్లోకి తీసుకుని దిగ్బంధనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగాణానికి రెండు కిలోమీటర్ల మేర నుంచే రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధ‌వారం జగన్ పర్యటన ఉంది.

ఈ పర్యటన సందర్భంగా పట్టణాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. దాదాపు రెండు రోజుల ముందే రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో సభా ప్రాంగణ నిర్మాణం కోసం రెండు చోట్ల ప్రహరీ గోడ, పలు చెట్లు కూల్చివేశారు. జమ్మి కూడలి నుంచి సభాస్థలికి చేరేంతవరకు రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ ప‌రిణామాల‌తో మంగ‌ళ‌వారం నుంచి డిగ్రీ కళాశాల పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. కళాశాల రోడ్డులో దుకాణాలు మూసివేశారు. దుకాణాలకు వెళ్లకుండా అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వ్యాపారం లేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి రాక సమయంలో వాహనాలను హైవే మీద నుంచి మళ్లించనున్నారు. ఇదీ.. సంగతి.. సార్ ఒస్తున్నారంటే.. జ‌నాలు జుట్టుపీక్కునే ప‌రిస్థితి తెచ్చార‌ని లోక‌ల్ పీపుల్ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి జ‌గ‌న‌న్నా మ‌జాకా!