టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌: మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని అన్నారు. చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఇటీవలే శశిధర్ రెడ్డిని హస్తం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సంద‌ర్భంగా శ‌శిధ‌ర్‌.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అధికార టీఆర్ఎస్ తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో నేడు ఉన్న‌ పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాణిక్కం ఠాగూర్‌ పుట్టక ముందు నుంచి పార్టీలో రాజకీయాలు చూస్తున్నానని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయినా.. సమీక్షించి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.

పీసీసీలకు ఏజెంట్లుగా ఇంఛార్జిలు పని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో డబ్బులు ఇచ్చేవాళ్ల మాటే చెల్లుతుందని అన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు చాలా బాధగా ఉందని మర్రిశశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు ఎంపికలో తన తండ్రి చెన్నారెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పారు. ఇన్నేళ్లు పార్టీతో తనకున్న అనుబంధాన్ని వదిలి వెళ్తున్నందుకు విచారం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీ పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న ఆయన.. కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ కూడా చెప్పారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్‌..అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు కేర‌ళ లేదా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.