మెగాస్టార్‌కు.. మోడీ గేలం మామూలుగా లేదుగా!

ఔను! రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇప్ప‌టి త‌రం నేతలు ఏంచేశార‌న్నా.. వారికి అర్ధం ప‌ర‌మార్థం ద‌క్క‌కుండా ఏదీ చేయ‌రు. అది ఏదైనా కావొచ్చు. అటు పార్టీకి, లేదా వారికి ఉపయో గం ఉంటుందంటేనే అడుగుతీసి అడుగు వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్ద‌రించుకోవాల‌ని సూచించినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. అంతేకాదు, ఇటీవ‌ల రాహుల్ గాంధీ హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా మ‌ర్యాద పూర్వ‌కంగా అయినా వ‌చ్చి పొమ్మ‌ని కొంద‌రు అత్యంత కీల‌క నాయ‌కులు, సినీ మాజీ న‌టులు కూడా ఆయ‌న‌కు సందేశాలు పంపించారు. కానీ, చిరు మాత్రం సున్నితంగా తిరస్క‌రించారు.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా ప్ర‌ధాని మోడీ వ‌ల విసురుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌నను ఇండియ‌న్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్ -2022 జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో(అటాన‌మ‌స్ అంటారు కానీ,..?) ఉంటుంది. దీనికి ఎంతో మంది దిగ్గ‌జ న‌టులు పోటీ ప‌డ్డారు. అయినా.. కూడా ప‌ట్టుబ‌ట్టి చిరును ఎంపిక చేశారు. అంతేకాదు.. కేంద్రంలోని పెద్ద‌లు వ‌రుస పెట్టి చిరుకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ఈ పుర‌స్కారానికి 100 కు 200 శాతం చిరంజీవికి అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ ఇచ్చిన వారు, ప్ర‌క‌టించిన వారి విష‌యంలోనే అనేక అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రిలో నిర్వ‌హించిన అల్లూరి సీతారామరాజు విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌ధాని మోడీ చిరుతో ర‌హ‌స్యంగా వేదికపైనే చెవిలో ఏదో చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా అవార్డు.. పైగా ఆసేతు హిమాచ‌లం నుంచి చిరుకు కూడా తెలియ‌ని పెద్ద‌ల అభినంద‌న‌లు. ఇవ‌న్నీ చూస్తుంటే ఏదో ఆశిస్తున్నార‌ని, గేలం బ‌లంగానే వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.