జగన్ పై ఫైర్ అయిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ది ప్ర‌జాప్ర‌భుత్వ‌మేనా? ఇంకేమైనా ఉందా? అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలను ప్ర‌శ్నిస్తున్న వారిపైనా, నిర‌స‌న తెలుపుతున్న వారిపైనా తీవ్ర‌స్థాయిలో నిర్బంధ కాండ కొన‌సాగుతోంద‌ని, దీనిని చూస్తుంటే ఏపీలో ఉన్న‌ది ప్రజా ప్రభుత్వమేనా? అన్న అనుమానంగా ఉందని అన్నారు. తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ హాజరయ్యారు.

ఈ సంద‌ర్బంగా జ‌స్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడవడం లేదని విమర్శించారు. పోలీసు నిర్బంధాలపై కోర్టులలో కేసులు వేయాలని కార్మిక సంఘాలకు సూచించారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచు కోవాలన్నారు. సీఆర్పీసీ, ఐపీసీ ఉల్లంఘనపై పోలీసు అధికారులపై కోర్టులకు ఎందుకు పిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మిక హక్కుల ఉల్లంఘనపై కోర్టు తలుపు తట్టడంలో తప్పు లేదన్నారు. పౌరునిగా ఉన్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగ వ్యవస్థ కల్పించిందని, పోలీసు వ్యవస్థ అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కానీ, ప్ర‌స్తుతం పోలీసులే ప్ర‌భుత్వ అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ.. చ‌ట్టాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఇటీవ‌ల కాలంలో కోర్టులు వారిని హెచ్చ‌రిస్తుండ‌డం గతంలో ఏ ప్ర‌భుత్వంలోనూ తాను చూడ‌లేద‌ని జ‌స్టిస్ గోపాల‌గౌడ అన్నారు. ప్ర‌స్తుతం చ‌ట్టాలు గౌర‌వించ‌కుండా.. ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించేవారు.. భ‌విష్య‌త్తులో వ‌చ్చే ప్ర‌భుత్వాల‌కు స‌మాదానం చెప్పుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇలా చేసిన చాలా మంది ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారో చ‌రిత్ర తెలుసుకోవాల‌ని సూచించారు.

కార్మికులు పనిచేయకపోతే దేశ అభివృద్ధి జరగదని, అలాగే ప్రభుత్వాలు వారి హక్కులను కాలరాయకూడదని జ‌స్టిస్ గోపాల‌గౌడ వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికులు ఈ దేశానికి చాలా అవసరమన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆందోళనను పోలీసులు అణగదొక్కడం సిగ్గుచేటని, పోలీసు వ్యవస్థ పరిధికి మించి వ్యవహరించకూడదని మాజీ జస్టిస్ గోపాలగౌడ వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీసులు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు.