ప‌వ‌న్ ఏదో ఒక రోజు సీఎం అవుతాడు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న ఆయ‌న‌.. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన కల్యాణ్ సమర్థుడని పేర్కొన్నాడు. పవన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయి(సీఎం)లో చూసే అవకాశం వస్తుందని చిరంజీవి అభిలాషించారు.

“ఏదైనా తలచుకుంటే దాని అంతుచూడటం నాకు అలవాటు. నా మనసులో నుంచి రాకపోతే.. నేను దాని అంతు చూడలేను. నేను అంతు చూడనది అంటే ఏంటో మీకు తెలుసు. అందుకే అక్కడి నుంచి వెనక్కి వచ్చా. అక్కడ రాణించడం కష్టం.. అక్కడ సెన్సిటివ్గా ఉండకూడదు. బాగా మొరటుగా ఉండాలి.. రాటు దేలాలి. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. అవసరమా ఇది.. తాను(ప‌వ‌న్‌) తగినవాడు.. తాను అంటాడు, అనిపించుకుంటాడు.. అలాంటివాళ్లకు మీరందరూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో ఏదో ఒకరోజు అత్యున్నతస్థానం(ముఖ్య‌మంత్రి)లో మనం ప‌వ‌న్‌ని చూస్తాం” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్, ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన నర్సాపూర్ వైఎన్ఎంసీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ఈ వ్యాఖ్యలు చేశారు. కళాశాల అధ్యాపక బృందాన్ని, సహచార మిత్రులను ఆత్మీయంగా సన్మానించిన మెగాస్టార్.. నాటి కళాశాలలో చదివిన రోజులను గుర్తు చేసున్నారు. పాఠాల కంటే జీవిత పాఠాలను ఎలా చదవాలో వైఎన్ఎంసీ కళాశాల నేర్పించిందన్నారు. నటుడిగా క్రమశిక్షణతో ఉన్నానంటే కళాశాలలోని ఎన్సీసీ నేర్పించిన పాఠాలేనన్నారు. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ డీఎస్ ఆర్ వర్మ, గ్రంధి భవానీ ప్రసాద్తో పాటు పెద్దసంఖ్యలో నాటి మిత్రులంతా ఈ వేడుకకు హాజరై నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.