కేసీఆర్ కు ఏపీ పై జాలి తో కూడిన ప్రేమ?

పొరుగు రాష్ట్రం ఏపీ విష‌యంలో తెలంగాణ మంత్రులు ఒక‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అస‌లు దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మంత్రుల‌ను తీసుకుంటే.. హ‌రీష్ రావు, కొప్పుల ఈశ్వ‌ర్ వంటివారు ఏపీపై ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాస్త‌వానికి హ‌రీష్‌రావు అయితే.. కొన్నాళ్లుగా ఏపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా ఆయ‌న ఏపీని తీవ్రంగానే విమ‌ర్శించారు.

తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేస్తామ‌ని.. ఒక‌వైపు ఏపీ ప్ర‌భుత్వం చెబుతుంటే.. దీనిపైనే హ‌రీష్‌రావు కామెంట్లు చేశారు. మ‌రో ఐదేళ్లు అయినా.. పోల‌వ‌రం ప‌నులు కావ‌ని అన్నారు. ఏపీ పాల‌కుల‌కు ముందు చూపులేద‌ని చెప్పారు. అదే, తెలంగాణ లో అయినా.. పోల‌వ‌రం క‌న్నా.. వెనుకాల ప్రారంభించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ధ‌నా ధ‌న్‌.. అన్న‌ట్టుగా పూర్త‌యింద‌ని.. దీనివ‌ల్ల ఫ‌లితాన్ని కూడా రైతుల‌కు అందించామ‌ని మంత్రి హ‌రీష్ రావు చెప్పుకొచ్చారు. ఇది ఏపీలో ప్ర‌భుత్వంపై భారీగానే ప‌నిచేసింది.

ఇక‌, కొప్పుల ఈశ్వ‌ర్ అయితే.. మ‌రో అడుగు ముందుకు వేసి.. ఏపీలో ప్ర‌భుత్వం.. కేంద్రాని వ‌ణుకుతోంద‌న్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని.. ప్ర‌వేటీక‌రిస్తు న్నార‌ని.. దీనిని ప్ర‌శ్నించే ద‌మ్ము ఏపీకి లేద‌ని ఆయ‌న పెద్ద కామెంటే చేశారు. అదేస‌మ‌యంలో త‌మ సింగ‌రేణి విష‌యంలో కేంద్రం తోక‌ముడిచింద ని.. దీనికి కార‌ణం బ‌ల‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నార‌ని అన్నారు. ఇక‌, ఈ కామెంట్లు కూడా ఏపీలో రాజకీయ ర‌చ్చ‌కు దారితీశాయి. ఇదిలావుంటే, మ‌రోవైపు.. సీఎం కేసీఆర్ మాత్రం ఏపీపై జాలి చూపిస్తున్నారు.

తాజాగా ఆయ‌న పార్టీ నాయ‌కుల విస్తృత స‌మావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ పార్టీలోని కీల‌క నాయ‌కుల‌ను ఎర‌వేసి లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. అయినా.. తాము లొంగేది లేద‌ని చెప్పారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఆయ‌న ఏపీగురించి కూడా ప్ర‌స్తావించారు. పాపం ఏపీ పై కూడా..బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని, అక్క‌డ కూడా సుస్థిరంగా ఉన్న‌ ప్ర‌భుత్వాన్ని అస్థిరంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ కుట్ర‌ల‌ను అంద‌రూ కలిసి తిప్పికొట్టాల‌ని అన్నారు.

అంటే.. కేసీఆర్ ఉద్దేశంలో త‌న‌తో ఏపీ క‌లిసి రావాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మంత్రులుచూస్తే.. నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో ఏపీని విమ‌ర్శిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఇలా పొగ‌డ‌డం చూస్తే.. వ్యూహం ఏంట‌నేది అర్ధం కావ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో..!