ప‌వ‌న్ పవర్ఫుల్ సంకేతాలు

తాజాగా విశాఖ‌కు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ భేటీ అయ్యారు. ఇది రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు కూడా మోడీ అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌కుండా.. త‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం ఆశ్చ‌ర్య‌మ‌నే అనిపించింది. నిజానికి మోడీ చాలా రాష్ట్రాల్లోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డి మిత్ర‌పక్ష నాయ‌కుల‌కు ఆయ‌న అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌డం లేదు.

కానీ, ఏపీని భిన్నంగా చూస్తున్న సంకేతాలు ఇస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ.. జ‌న‌సేనానితో భేటీ కావడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే, ఈ భేటీ ద్వారా ఇటు ప‌వ‌న్‌కానీ, అటు మోడీ కానీ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు పంపించాల‌ని అనుకుంటున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితి ఏపీలో భిన్నంగా ఉంది. టీడీపీ-జ‌న‌సేన చేతులు క‌ల‌పాల‌ని అనుకుంటున్నాయి. దీనిని వైసీపీ వ్య‌తిరేకిస్తోంది.

ఇదే విష‌యంపై కొన్నాళ్లుగా బీజేపీతో వైసీపీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు చేస్తోంది. ప‌వ‌న్ ను మీరు వ‌దులు కోవ‌ద్దు.. అంటూ.. ప‌రోక్షంగా టీడీపీకి దెబ్బేసే కార్య‌క్ర‌మం తెర‌చాటున జ‌రిగిపోతోంది. ఇక్క‌డ బీజేపీ కూడా ప‌వ‌న్‌ను వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ప‌వ‌న్ ద్వారా 10 స్థానాల్లో అయినా గుర్తింపు తెచ్చుకుంటే త‌ద్వారా రాష్ట్రంలో విస్త‌రించే కార్య‌క్ర‌మానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుడు ఇదే వ్యూహం నేప‌థ్యంలో మోడీ ఆయ‌న‌కు అప్పాయింట్‌మెంటు ఇచ్చార‌నే చ‌ర్చ‌సాగుతోంది.

బీజేపీ నాయ‌కులు కూడా త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేద‌ని బాధ‌ప‌డ‌డంలేదు. ప‌వన్‌కు అప్పా యింట్‌మెంటు ఇవ్వ‌డాన్ని వారు స్వాగ‌తిస్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ కూడా మోడీని క‌ల‌వ‌డం ద్వారా.. ఆయ‌న వ్యూహం వేరేగా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ డం, పార్టీలో నైతిక స్థ‌యిర్యాన్ని పెంచ‌డం వంటి కీల‌క అంశాల‌ను ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నారు. నా వెనుక కేంద్ర‌మే ఉంది.. మోడీ ఉన్నాడ‌నే సంకేతాల‌ను ప‌వ‌న్ పంపించాల‌నేది వ్యూహం. ఈ రెండు వ్యూహాల నేప‌థ్యంలోనే ఇరు ప‌క్షాలు ప్ర‌ధాని భేటీకి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి.