మోడీతో భేటీ.. పవన్ ఏం చెప్పారు?

మిత్రుడే అయినా ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి మోడీకి గుర్తుకు రాని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు.. మూడు రోజుల క్రితం గుర్తుకు రావటం.. అది కూడా తన ఏపీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కావటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే విశాఖ నుంచి ఈ మధ్యన వచ్చిన పవన్.. పోలీసుల సూచన మేరకు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా అదే పోలీసులు ఆయనకు ఎలాంటి ఇబ్బందికర సీన్ ఎదురు కాకుండా కాపాలా కాసి స్వాగతించారు. ఎప్పటిలానే పవన్ కల్యాణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రావటం విశేషం.

ప్రధానిని కలిసేందుకు ఆయన బస చేసిన ప్రాంతానికి వెళ్లారు. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం మోడీతో అరగంట పాటు భేటీ అయినట్లు పేర్కొంటే.. జనసేన అధికారిక మీడియా గ్రూప్ లో మాత్రం 40 నిమిషాల పాటు భేటీ సాగినట్లుగా పేర్కొన్నారు. ఈ భేటీపై జనసేన మీడియా గ్రూపు స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ భేటీ.. సుహృద్భావంగా.. ప్రేమపూర్వకంగా.. సంతృప్తికరంగా సాగినట్లుగా పేర్కొన్నారు.

ఇక.. ప్రధానితో భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ నోటి నుంచి ముక్తసరి మాటలే వచ్చాయి. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడుతూ.. ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యతను ఆయన చెప్పకనే చెప్పేశారు తన మాటలతో.. దాదాపు 8 సంవత్సరాలు తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలవడం సంతోషంగా ఉంది. 2014 ఎన్నికల ముందు శ్రీ నరేంద్ర మోదీ గారితో కలిసి ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ శ్రీ మోదీ గారిని కలవలేదు. ఇప్పుడు రాష్ట్ర పర్యటన సందర్భంగా రెండు రోజులు క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

శ్రీ మోదీ గారిని కలవాలని చెప్పడంతో ఈ రోజు ఆయనతో పలు విషయాల పట్ల చర్చించాం. రాష్ట్రంలోని వివిధ అంశాలను, పరిస్థితులను శ్రీ మోదీ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిపై నా వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనతో పంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అన్నదే ప్రధాని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలన్నదే శ్రీ మోదీ గారు కోరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో శ్రీ నరేంద్ర మోదీ గారితో ఈ సమావేశం జరిగింది. కచ్చితంగా దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఉంటాయి.. అని పవన్ చెప్పారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని చూస్తే.. తాను చెప్పాల్సిన అన్ని విషయాల్ని ప్రధానమంత్రికి చెప్పేసిన భావన కలుగక మానదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. తాను విబేధించే అంశాలతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపైనా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసి ఉంటారని చెప్పాలి. మరి.. బీజేపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటామని గతంలో చెప్పిన పవన్.. మోడీతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ గురించి ఏం మాట్లాడారు? మోడీ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాలపై మరింత సమాచారం రావాల్సి ఉంది.