ఓట్ల లెక్కింపు వేళలోనూ కేఏపాల్ కామెడీ ఆగలేదుగా?

గంభీరంగా ఉండే రాజకీయాలకు తనదైన మార్కు అద్దటం ద్వారా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సైతం కామెడీగా మార్చేసే విలక్షణ వ్యక్తిత్వం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ సొంతంగా చెప్పాలి. చాలామంది ఆయన్ను కామెడీగా తీసుకుంటారు. కానీ.. ఆయన మాటల్నిసీరియస్ గా విన్న వారెవరూ కూడా ఆయన్ను కామెడీ పీస్ గా ఫీల్ కారు. ఆయనలో చతురత ఎక్కువ. ఏదైనా ప్రశ్న అడగాలే కానీ.. అస్సలు వెనక్కి తగ్గరు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు సైతం షాకింగ్ రిప్లైలు ఇవ్వటం ద్వారా తన సత్తా ఏమిటో చాటి చెబుతుంటారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారిన కేఏ పాల్.. పోలింగ్ రోజున ఎన్ని యేషాలు వేశారో.. మరెంత కామెడీ చేశారో తెలిసిందే. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన ఉంగరం గుర్తును.. అందరూ గుర్తుంచుకోవటానికి వీలుగా.. పది వేళ్లకు పది ఉంగరాల్ని పెట్టుకోవటం తెలిసిందే. మీకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఇలా వేళ్లకు పెట్టుకొని తిరగటమా? అని ప్రశ్నిస్తే.. టీఆర్ఎస్ వాళ్లు 30 వేల కార్లలో తిరుగుతున్నారు. వారి ఎన్నికల గుర్తు కారు కాబట్టి.. కారు వాడటం ఆపేయమంటారా? అంటూ ప్రశ్నిస్తూ షాకిచ్చారు.

ఈ ఎన్నికల్లో కేఏ పాల్ కు వచ్చే ఓట్ల మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. దీనికి తగ్గట్లే.. ఓట్ల లెక్కింపు వేళలోనూ అలాంటి పరిస్థితే ఉంది. మొత్తం మూడు రౌండ్లకు కలిపి కేఏ పాల్ కు 34 ఓట్లు రావటం చూస్తే.. ఓటర్లలో ఆయనకున్న ఇమేజ్ ఎంతన్న విషయం అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు ఒకవైపు జోరుగా సాగుతున్న వేళ.. ఆయన పోలీసుల్ని అడిగిన అనుమతి గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే.. పోలీసుల్ని ఆయన ఎన్నికల విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరారు.

ఎందుకిలా అంటే.. మునుగోడులో తాను 50 వేల మెజార్టీతో విజయాన్ని సాధిస్తున్నానని.. అందుకు అవసరమైన విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అయితే.. పోలీసులు ఈ విన్నపానికి ఒప్పుకోలేదు. రిజెక్టు చేశారు. 50 వేల మెజార్టీ తర్వాత.. ముందు 500 ఓట్లు దాటితే అదే గొప్ప అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప పోరులో కేఏపాల్ కామెడీ అన్ స్టాపబుల్ అని మాత్రంచెప్పక తప్పదు.