చౌటుప్ప‌ల్ ముంచేసింది: కోమ‌టిరెడ్డి బ్లాస్ట్‌

హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బ్లాస్ట్ అయ్యారు. కీల‌క‌మైన మండ‌లంలో తాము దెబ్బ‌తిన్నామ‌ని చెప్పారు. చౌటుప్పల్‌లో తాము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదని, ఈ మండ‌లం ముంచేసింద‌ని వ్యాఖ్యానించారు. అయితే, మిగిలిన మండలాల్లోనూ పోరు హోరాహోరీగా సాగనుందని వివరించారు.

ఏం జ‌రిగింది?

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి రెండు పరిణామాలు టీఆర్ఎస్, బీజేపీలను కలవరపాటుకు గురిచేశాయి. తొలి రౌండ్‌‌లో చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు బీజేపీని తీవ్ర నిరాశ‌లో ముంచేశాయి. చౌటుప్పల్ మండలంపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మండలం చౌటుప్పల్. ఈ మండలంలో బీజేపీ భారీగా మెజార్టీ వస్తుందని భావించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చౌటుప్పల్ మండలంపై బోలెడాశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్‌ నాటికి చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాజగోపాల్‌రెడ్డికి ఆదరణ ఉంది.

కాగా అత్యధిక ఓటర్లు ఉన్న ఈ మండలంలో ఆధిపత్యం సాధించేందుకు అధికార టీఆర్ఎస్‌ వ్యూహాత్మకంగా పనిచేసింది. మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వంటి ఉద్ధండులకు ఇక్కడ ఎన్నికల బాధ్యత అప్పగించారు. బీజేపీ ఆధిపత్యాన్ని ఎన్నికల నాటికి తగ్గించామని టీఆర్ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. చివరకు అదే జరిగింది.

చౌటుప్పల్ మండలంలో బీజేపీకి మెజార్టీ రాకపోగా.. టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. 4 రౌండ్లతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు ముగిసింది. చౌటుప్పల్ మండలంలో మొత్తం పోలైన ఓట్లు 55,678. టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 21,209, బీజేపీ 21,174, కాంగ్రెస్ 5,164. చౌటుప్పల్ మండలంలో బీజేపీని ఆశించిన స్థాయిలో ఓటర్లు ఆదరించలేదని స్పష్టమైంది. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఈ విషయంలో నిరాశ చెందారు.