జగన్ పార్టీని భయపెడుతున్న సెల్ఫీ

Jagan

ఏపీలో తిరుగులేని శక్తిగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు అధినేత మాత్రం తగ్గని వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పార్టీ ఎంపీ రఘురామ రాజు కలకలం గురించి తెలిసిందే. పార్టీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన తీరుపై ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వటం తెలిసిందే. ఇలాంటివేళ.. పార్టీకి చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామరాజు కలిసి ఉన్న సెల్ఫీ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇరువురునేతలు హ్యాపీగా ఉన్నవేళ తీసుకున్న ఫోటో ఇప్పుడు పార్టీని భయపెడుతోంది.

అగ్నికి ఆయువు తోడైనట్లు.. రఘురామకు ఆనం లాంటి సీనియర్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆనం అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని మర్చిపోకూడదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు సెట్ కాక.. ఆయనకు మంత్రి పదవి రాలేదని చెబుతారు. జగన్ తీరుపై గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళలోనే.. పార్టీకి చెందిన మరో అసంతృప్తి నేతగా ముద్ర పడిన రఘురామరాజుతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు పలువురుఈ ఫోటోను చూసినంతనే ఉలిక్కిపడుతున్నారు. అయితే.. ఈ ఫోటో ఎప్పుడు దిగింది? ఏ సందర్భంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు? అన్న అంశాలపై జగన్ పార్టీ నేతలు ఆరా తీయటం మొదలైనట్లు తెలుస్తోంది.