ప్రతిపక్ష నేతల్ని హీరోలను చేయడమే పనా?

అదేమిటో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది ముట్టుకున్నా మసైపోతోంది. ప్రతి ఇష్యూలోనూ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పట్లేదు. అనాలోచిత నిర్ణయాలతో కోరి వివాదాలను కొని తెచ్చుకోవడం ముదు నుంచి ఉంది కానీ.. ఈ మధ్య ప్రతి నిర్ణయం బూమరాంగ్ అయి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుండడం, ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుండటం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అనవసరంగా వివాదాస్పదంగా మార్చడం, పోలీసుల ఓవరాక్షన్ కారణంగా జనసేనాని హీరో కావడం, పొలిటికల్‌గా ఆయనకు మంచ మైలేజీ రావడం తెలిసిందే.

ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని కూడా అలాగే హీరోను చేసింది జగన్ సర్కారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ దూకి అమానుష రీతిలో ఆయన్ని, కొడుకుని అరెస్ట్ చేయడం దుమారం రేపింది.

తమపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసే నాయకుల్ని వైసీపీ ప్రబుత్వం టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా చాలామందిని ఇలా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేసిన తీరు, తర్వాత హింసించిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. కానీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుండడం, తాము టార్గెట్ చేసిన నేతలు హీరోలవుతుండటం మరిచిపోతున్నారు.

రఘురామకు ఆ దాడి తర్వాతే జాతీయ స్థాయిలో అటెన్షన్ వచ్చిది. మీడియాలో ఆయనకు మంచి ప్రాధాన్యం దక్కుతోంది. రఘురామ ఉదంతం తర్వాత ప్రతిపక్ష నేతలు కూడా ఇలాంటి వాటికి ముందే ప్రిపేరై ఉంటున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపునకు ప్రయత్నించినపుడు ఎలా బయటపడాలో ముందే ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. మీడియాలో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారి వారికే అడ్వాంటేజీ అవుతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.

ఇంతకుముందు టీడీపీ నేత పట్టాభిరామం విషయంలో.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విషయంలోనూ దాదాపుగా అలాగే జరిగింది. వివాదాస్పద రీతిలో జరిగిన అరెస్టుతో ఆయనపై ముందు సానుభూతి వచ్చింది. పోలీసు కస్టడీకి వెళ్లకుండా బెయిల్ సంపాదించడంతో ఆయన హీరో అయ్యారు. కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయింది. మొత్తానికి ప్రతిపక్ష నేతలను హీరోలను చేయడమే జగన్ సర్కారు పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.