ప్ర‌శ్నించిన వ్య‌క్తిని చిత‌క్కొట్టిన సీఎం జ‌గ‌న్ మేన‌మామ‌..

ఆయన ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కి స్వయానా మేనమామ.. తమ ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడపగడపకు కార్యక్రమంలో పర్యటిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం చేసే గొప్పలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆయనకు.. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వెళ్లిన ప్రతిచోట ప్రశ్నల వర్షం కురవడంతో.. సహనం నశించిన ఆయన బూతు పురాణం మెుదలెట్టాడు. అంతేకాదు, ఒక వ్య‌క్తిని చేత్తో ట‌పా ట‌పా వాయిస్తూ చిత‌క్కొట్టేశాడు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జ‌గ‌న్ సొంత మేన‌మామ‌(విజ‌య‌మ్మ త‌మ్ముడు), క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమ‌యంలో రాక రాక వ‌చ్చిన త‌మ ఎమ్మెల్యేను ప్రజలు పలు సమస్యలపై పదేపదే ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అసహనంతో దుర్భాషలాడాడు. అంతేకాదు, సమస్య చెబుతున్న ఓ వ్యక్తిపై చిందులేసిన ఎమ్మెల్యే… అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నారు.

కమలాపురం నియోజకవర్గం వీర‌పునాయ‌ని పల్లె మండలం అందెల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పబ్లిక్‌లో చేయిచేసుకోవడంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసినవాళ్లు స్వయానా ముఖ్యమంత్రి మేనమామే ఇలా ప్రవర్తించడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. క‌ర్నూలులో ఆదోని ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి త‌న సొంత పార్టీ కార్య‌క‌ర్త‌పైనే చిందులు తొక్కారు. దీనిపై మీడియాలోనూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే సీఎం జ‌గ‌న్ సొంత మేన‌మామ ఇలా చేయి చేసుకోవ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనిపై సీఎం జ‌గ‌న్ స్పందిస్తారో లేదో చూడాలి.