జ‌గ‌న్‌కు సాయం చేయ‌డం పెద్ద పొర‌పాటు: పీకే

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త నుంచి ఉద్య‌మ బాట ప‌ట్టిన ‘జ‌న్ సురాజ్’ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు.. ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న సాయం చేసి.. రోడ్ మ్యాప్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న బాట‌లోనే జ‌గ‌న్ న‌డిచి.. అధికారాన్ని ద‌క్కించుకున్నారు. అయితే, తాజాగా ఈ విష‌యంపై పీకే స్పందించారు. “జ‌గ‌న్‌కు సాయం చేసి పెద్ద పొర‌పాటు చేశా. ఎందుకు సాయం చేశానా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా. అదేవిధంగా బిహార్ లో నితీశ్‌కుమార్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కూడా కృషి చేశారు. ఈ రెండు నేను చేయ‌కుండా ఉండాల్సింది” అని హాట్ కామెంట్స్ చేశారు.

ఈ ఇద్ద‌రు నాయ‌కుల కోసం చాలా స‌మ‌యాన్ని వృథా చేసుకున్న‌ట్టు పీకే చెప్పారు. అంతేకాదు, ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను బ‌తికించుకునేందుకు ప్ర‌య‌త్నించి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో పెరుగుతున్న‌ గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే అదొక్కటే(కాంగ్రెస్‌ను పున‌రుజ్జీవింప‌చేసుకోవ‌డం) మార్గమని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని అన్నారు. బిహార్లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఏమ‌న్నారంటే.. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమలదళం విజయయాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై ప్రశాంత్ కిశోర్ అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీని అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. “మీరు ఎప్పుడైనా కాఫీ కప్పును చూశారా? పైనంతా నురగ ఉంటుంది. బీజేపీ అలాంటిదే. కింద భాగంలో.. వేళ్లూనుకున్న ఆర్ఎస్ఎస్ ఉంటుంది. సామాజిక వ్యవస్థలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాగమైపోయింది. షార్ట్కట్స్తో దానిని ఓడించలేరు. గాడ్సే సిద్ధాంతాన్ని.. కాంగ్రెస్కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే జయించగలం” అంటూ మహాత్ముడ్ని చంపిన గాడ్సేకు, ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు..

కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ఆయన గతేడాదే కాంగ్రెస్లో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఆ చర్చలు ఫలించలేదు. పీకే కాంగ్రెస్లో చేరలేదు. కాంగ్రెస్పై ఇప్పటికీ తనకు అభిమానం ఉందని.. కానీ మహాత్మ గాంధీ నేతృత్వంలోని పార్టీ తరహా పరిస్థితి ఉండాలని ఆయ‌న కోరుకుంటున్నారు. తాజా వ్యాఖ్య‌ల‌పై అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.