వైసీపీ – టీడీపీలో వార‌సుల లిస్ట్ పెరుగుతోంది…!

వారుసుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ స్ప‌ష్టం చేసినా.. నాయ‌కులు మాత్రం వెన‌క్కి త‌గ్గేదిలేద‌న్న‌ట్టు ముందుకే సాగుతున్నారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌హా.. కీల‌క నేత‌లు త‌మ వార‌సులను రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు ఓ ప‌ది మంది పేర్లు వినిపించ‌గా.. ఈ జాబితా ఇప్పుడు మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. కొత్త‌ముఖాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కొత్త‌వారికి టికెట్లు ఇవ్వాల‌ని పెద్ద ఎత్తున సీఎం జ‌గ‌న్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

“ఇప్పుడు సీఎం గారికి కావాల్సింది ఏంటి? పార్టీ గెలిచి..మ‌ళ్లీ ఆయ‌న సీఎం కావ‌డ‌మే క‌దా! దీనికి మేం హామీ ఇస్తున్నాం. మా త‌న‌యుడు పోటీలో ఉన్నా.. అంతా మేమే చూసుకుంటాం. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మాకు తెలుసు. నేను పోటీలో ఉన్నా.. నా కుమారుడు బ‌రిలో ఉన్నా ఒక‌టే. దీనికి ఎందుకు పిత‌లాట‌కం” అని కృష్ణాజిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక‌, శ్రీకాకుళంలోనూ ఇదే వాయిస్ వినిపిస్తోంది. పార్టీ గెలుపు కోసం అంద‌రం క‌ష్ట‌ప‌డ‌తాం. కానీ, ఈసారి మేం పోటీ చేయాల‌ని అనుకోవ‌డం లేదు. అని ఒక‌రు వ్యాఖ్యానించారు.

దీంతో ఈ విష‌యం సీఎం జ‌గ‌న్‌కు ఒకింత ఇబ్బందిగానే ప‌రిణమిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ వారసుల గోల ఎక్కువ‌గా వినిపిస్తోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వార‌సుల‌కు ఆయ‌న ఎక్కువ‌గా టికెట్‌లు ఇచ్చారు. అయితే.. వీరిలో ఒక్క ఆదిరెడ్డి భ‌వానీ త‌ప్ప‌మిగిలిన వార‌సులు ఓడిపోయారు. పోనీ.. ఇప్ప‌టికైనా వారిగ్రాఫ్ బాగుప‌డిందా? అంటే.. చెప్ప‌డానికి కొంత క‌ష్ట‌మైన ప‌రిస్థితి ఉంది. కొంద‌రు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు రావ‌డం లేదు. దీంతో వార‌సుల‌కు టికెట్లు ఇస్తే.. ఏం జ‌రుగుతుందోన‌ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

అలాగ‌ని వార‌సుల‌కు టికెట్లు ఇవ్వ‌కుండా ఉండ‌లేని ఒక చిత్ర‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి టీడీపీలో క‌నిపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు కూడా వార‌సుల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. చాలా చోట్ల వారి వార‌సులు చ‌క్రం తిప్పుతున్నారు. ఇదే వారు టికెట్లు డిమాండ్ చేసేందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఉంది. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.