పీకే పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ సాయం చేస్తున్నారా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరిట ఓ వేదికను స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. పీకే వెనుక ఎవరు ఉన్నారు? ఆయన ‘రాజకీయం’ కోసం నిధులు ఎవరు ఇస్తున్నారు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రశ్నలకు స్వయంగా జవాబు ఇచ్చారు ప్రశాంత్ కిశోర్. తాను చేస్తున్న పాద‌యాత్ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డ‌బ్బులు స‌ర్దు బాటు చేస్తున్నార‌ని.. అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రులు కూడా.. సొమ్ములు ఇస్తున్నార‌ని ప్ర‌క‌టించి.. సంచ‌ల‌నానికి తెర‌దీశారు.

బిహార్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నెలకొల్పడమే ధ్యేయంగా చేపట్టిన జన్ సురాజ్ ఉద్యమానికి తన మాజీ క్లయింట్లు(ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న సీఎంలు) ఆర్థిక సాయం చేస్తున్నారని వెల్లడించారు. గ‌తంలో రాజకీయ సలహాదారుగా పని చేసేందుకు తాను స్థాపించిన ఐప్యాక్ నుంచి గతంలో సేవలు పొందిన వారు ఇప్పుడు తనకు అండగా ఉంటున్నారని చెప్పారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నారని స్పష్టం చేశారు.

బిహార్లోని ప్రతి ప్రాంతాన్ని చుట్టొచ్చేలా 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్.. నేపాల్ సరిహద్దుల్లోని వాల్మీకి నగర్లో ప్రెస్ మీట్లో ఈ విషయం వెల్లడించారు. పీకేకు బీజేపీ ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉండొచ్చని జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జన్ సురాజ్ అధినేత స్పష్టత ఇచ్చారు.

“గత దశాబ్ద కాలంలో నేను కనీసం 10 ఎన్నికల కోసం వేర్వేరు పార్టీలకు సేవలు అందించాను. ఒక్కటి మినహా అన్ని ఎన్నికల్లోనూ సఫలం అయ్యాను. నా సాయంతో గెలిచిన వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులు. అప్పుడు నేను వారి దగ్గర డబ్బులు తీసుకోలేదు. బిహార్లో చేస్తున్న ఈ ప్రయోగం కోసం ఇప్పుడు నేను వారి సాయం తీసుకుంటున్నా. కానీ.. బిహార్లో మాత్రం నేను ఎవరి నుంచీ రూపాయి కూడా తీసుకోలేదు. హెలికాప్టర్లు, భారీ సభా వేదికలు, ప్రకటనలు, జన సమీకరణ వంటివాటికి ఖర్చులు చేయకుండానే మా పాదయాత్ర సాగుతోంది. మేము ఇంకా రాజకీయ పార్టీగా అవతరించలేదు. అదే జరిగితే.. బిహార్లోని రెండు కోట్ల కుటుంబాలు రూ.100 చొప్పున విరాళం ఇచ్చినా మాకు చాలు.” అని చెప్పారు ప్రశాంత్ కిశోర్. బిహార్లో ఇప్పటికే ఉన్న పార్టీలతో జట్టుకట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పీకే సేవలు పొందినవారే. గతేడాది బంగాల్లో టీఎంసీ విజయం తర్వాత.. పొలిటికల్ కన్సల్టెంట్గా రిటైర్మెంట్ ప్రకటించారు పీకే. జన్ సురాజ్ పేరుతో బిహార్ రాజకీయాల్లోకి దిగారు.