ఎవరీ స్వప్న సురేశ్? ఆ రాష్ట్ర సీఎంకే చుక్కలు చూపించింది

గడిచిన కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో భారీగా కవర్ అవుతున్న ఒక ఉదంతం తెలుగు మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా పెద్దగా వార్తలు రాని పరిస్థితి. కరోనా ఎపిసోడ్ లో దేశంలోనే అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును సొంతం చేసుకున్నారు.

దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు కేరళలోనే. ఆ తర్వాత కూడా వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. అలాంటిది.. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయటమే కాదు.. మరణాల విషయంలో అత్యంత తక్కువగా నమోదయ్యేలా చేయటంలో పినరయి సర్కారు సక్సెస్ అయ్యింది.

అలాంటిది తాజాగా ఆయన ప్రభుత్వం బంగారుస్కాంలో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరకు సీఎం సీటుకే ఎసరు పెట్టేలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతం మొత్తం ముఖ్యమంత్రి విజయన్ కు.. ఆయన పేషీలో పని చేసే స్వప్న సురేశ్ చుట్టు తిరటం ఆసక్తికరంగా మారింది. చూసేందుకు స్టైల్ గా.. సినిమా హీరోయిన్ కు తగ్గని అందచందాలతో ఉండే స్వప్న సరేశ్ వ్యవహారం వివాదాస్పదంగా మారటమే కాదు.. అసలు ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న కుతూహలం పెరుగుతోంది.

కేరళలో వెలుగు చూసిన గోల్డ్ స్కాంను సింఫుల్ గా చెప్పాలంటే.. దుబాయ్ నుంచి యూఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానం ఒకటి తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు వచ్చింది. అందులోని సరుకును ఈ నెల 5న కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సందర్భంగా 30 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా దౌత్య మార్గంలో వచ్చిన వస్తువుల్నితనిఖీ చేయరు. కానీ.. పక్కా సమాచారం కస్టమ్స్ అధికారులకు అందటంతో అరుదైన రీతిలో తనిఖీల్ని నిర్వహించారు. ఇంటి సామాన్ల మధ్యలో బంగారాన్ని గుర్తించారు.

అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో స్వప్న సురేశ్ చుట్టూ తిరిగింది. సీఎంవో నుంచి చక్రం తిప్పిన ఆమె.. వ్యవహారం మీడియాలో రావటంతో రచ్చ మొదలైంది. ఆమెను సీఎంవోలో పని చేసే అవకాశం ఇచ్చిన అధికారులపైనా.. పలువురిపైనా పినరయి సర్కారు చర్యలు తీసుకుంది. అయితే.. సీఎంకు స్వప్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తుసంస్థకు కేసు విచారణ బాధ్యతను అప్పజెప్పినట్లుగా కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. అసలీ స్వప్నా సురేశ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఆమెకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమంత్రి విజయన్ తో పాటు.. పలువురు ప్రముఖులతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆమె కెరీర్ ను చూస్తే.. మొదట్నించి వివాదాస్పదంగానే ఆమె కనిపిస్తారు.

తిరువనంతపురంలో ట్రావెల్ ఏజెంట్ గా పని చేసిన ఆమె 2010లో దుబాయ్ వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్టులో పని చేస్తుండగా.. ఆరోపణలు రావటంతో ఆమె తిరిగి రాష్ట్రానికి వచ్చేశారు. అనంతరం యూఏఈ కాన్సులేట్ లో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన ఆమెపై ఆరోపణలు రావటంతో ఆమెను అక్కడా తొలగించారు. అనంతరం కేరళ ఐటీ మౌలిక సదుపాయాల సంస్థలో లైజనింగ్ అధికారిగా చేరిన ఆమె.. తర్వాతి కాలంలో సీఎంతో చక్రం తిప్పే వరకు వెళ్లారని చెప్పాలి. సీఎంవో ఆమె మాట నడుస్తుందని చెబుతారు. ఈ స్కాం వెలుగు చూసిన తర్వాత అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన లాయర్ ద్వారా కేరళ హైకోర్టులో ఆన్ లైన్ లో బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం గమనార్హం. ఏమైనా.. కేరళ సీఎంకు ఆమె పుణ్యమా అని చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.