జేడీ వెనుక వైసీపీ.. విశాఖ టాక్ గురూ..!

రాజ‌కీయాల్లో ఇది సాధ్యం.. అది సాధ్యం కాదు.. అనే మాట లేదు. ఏదైనా సాధ్య‌మే. నిన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరుకుని రోడ్డెక్కి రంకెలు వేసిన నాయ‌కులు అవ‌కాశం.. అవ‌స‌రం.. కోసం.. చేతులు క‌లిపేసిన ప‌రిస్థితి మ‌న‌కు తెలిసిందే. ఇక‌, నిన్న‌టి వ‌ర‌కు కౌగిలించుకుని.. ఒకే కంచం.. ఒకే మంచంలా తిరిగిన నాయ‌కులను కూడా.. మ‌నం చూస్తున్న‌దే. సో.. రాజ‌కీయాల్లో ఏదీ.. సాధ్యం కాక‌పోవ‌డం అనేది ఉండ‌దు. ఇప్పుడు ఇదే మాట‌ను విశాఖ ప్ర‌జ‌లు అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయ‌ని చెబుతున్నారు.

సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ గురించి.. తెలిసిందే క‌దా. సీనియ‌ర్ ఐపీఎస్ అయిన ఆయ‌న‌.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కేసుల వెలికితీత‌.. ఆయ‌న ను జైలుకు పంపించిన అధికారిగా గుర్తింపు తెచ్చుకుని మీడియాలో ప్ర‌ముఖంగా నిలిచారు. ఒకానొక ద‌శ‌లో జేడీ పెద్ద హీరో కూడా అయిపోయారు. అయితే.. త‌ర్వాత కాలంలో అనూహ్యంగా ఆయ‌న ఐపీఎస్‌కు రిజైన్ చేసి.. రాజ‌కీయ బాట‌ప‌ట్టారు. 2019 ఎన్నిక‌ల‌కుముందు జ‌న‌సేన‌లో చేరి.. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ఎంత ప్ర‌య‌త్నించినా.. ప్ర‌జ‌ల‌కు అవి చేస్తాను.. ఇవి చేస్తాను.. అని బాండు పేప‌ర్ రాసి ఇచ్చినా.. ఓట‌మిని మాత్రం ఎదుర్కొన‌లేక పోయారు.

ఇక‌,త‌ర్వాత‌.. జన‌సేన అధినేత‌.. 2019 త‌ర్వాత‌.. ఓట‌మిని అంగీక‌రించి.. మ‌ళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామంపై అలిగిన జేడీ.. సినిమాలు చేయ‌న‌ని.. రాజ‌కీయాల్లోనే ఉంటాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. మ‌ళ్లీ సినిమాల్లోకి ఎలా వెళ్తారంటూ.. ప్ర‌శ్నించి.. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్నారు. కానీ, ఇప్పుడు.. రాజ‌కీయంగా జేడీ లైఫ్‌లో ‘ఏదో’ జ‌రిగిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాన‌న్నారు.

అదేస‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు దాదాపు అనుకూలంగా ఒక కామెంట్ కూడా చేశారు. విశాఖ‌కు ప‌రిశ్ర‌మ‌ల‌తోనే అభివృద్ది కాదు.. పాల‌న కూడా చేరువ కావాలి.. అని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌పైనే ఇప్పుడు విశాఖ వాసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈయ‌న వైసీపితో ఎక్క‌డో టై అప్ అయ్యారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జేడీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నార‌నే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి రూపాయి ఇవ్వ‌లేక‌పోడంతో ఖ‌ర్చు మొత్తం ఆయ‌నే భ‌రించారు. ఈ నేప‌థ్యానికి తోడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ‌లో ఏమైనా త‌మ వ్య‌తిరేక ఓటు ఉంటే.. అది జేడీ రూపంలో పోతుంద‌ని వైసీపీ కూడా అంచ‌నా వేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇది నిజం ఎంతో తెలియాలి.