అమ‌రావ‌తి రైతుల‌కు మ‌రో షాక్‌

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వైసీపీ స‌ర్కారు ఇక్క‌డి రైతుల‌కు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాద‌ని ముందుకే సాగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్ట‌బడి ఉన్నామ‌న్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రాజ‌ధాని కోసం.. ఇక్క‌డి రైతులు త‌మ సాగు భూముల‌ను ఇచ్చిన నేప‌థ్యంలో వాటిని రాజ‌ధాని కోసం వినియోగించాల్సి ఉంది.

అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం కింద‌.. ఇక్క‌డ పేద‌ల‌కు భూములు కేటాయించింది. అయితే.. దీనిపై హైకోర్టులో గ‌తంలోనే పిటిష‌న్లు ప‌డ్డాయి. రాజ‌ధాని కోసం.. తీసుకున్న భూముల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు ఎలా మ‌ళ్లిస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు వేయొద్ద‌ని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం త‌ను అనుకున్న‌ది చేసేందుకే మొగ్గు చూపింది.

ఈ క్ర‌మంలో చ‌ట్టంలోని కొన్ని క్లాజులు మారుస్తూ.. తీసుకున్న నిర్ణ‌యానికి.. ఇప్పుడుగ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్ర‌కారం.. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ..గవర్నర్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ అయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మ‌రి దీనిపై రైతులు ఏమంటారో చూడాలి.