మూడు రోజులు మునుగోడులోనే కేసీయార్

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల కోసం కేసీయార్ మూడు రోజులు క్యాంపు వేయబోతున్నట్లు సమాచారం. నోటిఫికేష్ విడుదలై అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత కేసీయార్ ఇంతవరకు మునుగోడువైపు చూడలేదు. అంతకుముందు ఒకసారి బహిరంగసభలో పాల్గొన్నారంతే. గడచిన ఎనిమిదిరోజులుగా ఢిల్లీలోనే మకాంవేసిన కేసీయార్ బుధవారమే హైదరాబాద్ కు తిరిగొచ్చారు. వెంటనే మునుగోడు ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు, నేతలతో సమీక్షించారు.

ఈ సమీక్ష తర్వాత తాను మూడు రోజుల పాటు మునుగోడులోనే క్యాంపు వేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారట. అన్నీ మండలాల్లోను రోడ్డు షోలు, చౌటుప్పల్ మండలం కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణ విషయాన్ని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. చౌటుప్పల్ మండలం హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉండటంతో ఈ మండలం చాలా కీలకంగా మారింది. ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

రాజగోపాలరెడ్డికి ప్రచారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఏదోరకంగా నెట్టుకొచ్చేస్తున్నారు. కాకపోతే పార్టీలోని రాష్ట్రస్ధాయి నేతలు, ఢిల్లీ పెద్దల నుండి ఇప్పటివరకు అందాల్సినంత మద్దతు అందలేదన్నది వాస్తవం. నియోజకవర్గంలోని నేతల్లో కొందరు సహాయనిరాకరణ చేస్తున్నా రాజగోపాల్ అయితే అందరినీ కలుస్తున్నారు. ఇదే సమయంలో స్రవంతి విషయం చూస్తే ప్రచారంలో ఆమెకు పెద్దగా ఇబ్బందులు ఏమీలేవనే చెప్పాలి. కాకపోతే ఎంతో ఆశలు పెట్టుకున్న భువనగిరి ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలోకి దిగకపోవటమే పెద్ద మైనస్.

అయితే ఆ మైనస్ ను ప్లస్సుగా మార్చుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి+సీనియర్లు బాగా కష్టపడుతున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు ప్రచారంలో బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకనే ఈ ఇబ్బందులను తొలగించేందుకే కేసీయార్ మూడురోజులు నియోజకవర్గంలోనే క్యాంపువేయాలని అనుకుంటున్నారట. దీనివల్ల మంత్రులు-అభ్యర్ధి, నేతలు-అభ్యర్థి మధ్య సమన్వయం సాధించడం వీలవుతుందని కేసీయార్ భావించారని సమాచారం. ఈ విషయమై తొందరలోనే పార్టీ నుండి ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు.