వైసీపీ కీలక నాయకుడు.. రాజ్యసభ ఎంపీ.. వి. విజయసాయిరెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే టైపు .. అనే పేరుంది. ఎప్పుడు ఎలాంటి విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలో.. ఆయనకు తెలిసినంతగా.. వైసీపీలో మరొకరి తెలియని అంటారు. ఇటీవల రాహుల్ గాంధీ.. చేపట్టిన పాదయాత్ర ఏపీలో ప్రవేశించినప్పుడు.. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏపీని విభజించిన వారు.. ఎలా అడుగు పెడతారు? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ విషయాన్ని ఆయనకు ప్రజలే గుర్తు చేయాలంటూ.. కామెంట్ చేశారు. అయితే.. సాయిరెడ్డి ఈ విషయంలో తాను సక్సెస్ అయ్యానని అనుకుని ఉండొచ్చు. కానీ, దీనికి కాంగ్రెస్ భారీ కౌంటరే ఇచ్చింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతిచ్చారని, దీనిపై అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ రాశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ పేర్కొన్నారు. తాను బళ్లారిలో ఉన్నానని, ప్రస్తుతం ఆ లేఖ తన వద్ద లేదని, పుస్తకంలో ఉందని వివరించారు. భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదని, ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన విషయాన్ని ప్రజలు రాహుల్ గాంధీకి గుర్తు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నేపథ్యంలోనే తాను రియాక్ట్ అవుతున్నట్టు జైరాం చెప్పారు.
సాయిరెడ్డి ట్వీట్ నేపథ్యంలో 2012 డిసెంబరు 28న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండేకు అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కేకే మహేందర్రెడ్డి రాసిన లేఖను పోస్టు చేశారు. “2011 జులై 8, 9వ తేదీల్లో జరిగిన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. అయినా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే మేము కోరుతున్నాం” అని అందులో ఉంది.
ఆ లేఖను జైరాం రమేశ్ మళ్లీ రీపోస్టు చేస్తూ.. ‘జగన్ ఆమోదించాకే వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు ఈ లేఖను పంపారు. గుర్తుందా? ఇంకా ఏమైనా చెప్పాలా?’ అని ప్రశ్నించారు. మరి సాయిరెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే.. ప్రపంచం చూడదని అనుకుంటే ఎలా.. అని సటైర్లు పడుతున్నాయి.