జ‌న‌సేన‌లోకి వ‌చ్చే దెవ‌రు.. సీనియ‌ర్లు దూరం దూరం…!


జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయాల‌ని.. పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న రోజు వారీ స‌మీక్ష‌లు చేసేందుకు కూడా నిర్ణ‌యించారు. జిల్లాల వారీగా నేత‌ల‌ను నిర్ణ‌యించి.. వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని చూస్తున్నారు. ఒక‌టి రెండు రోజుల్లోనే దీనిపై ప‌క్కా ప్లాన్ ను అమ‌లు చేయ‌నున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చేవారిని ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు.

నిర్ణ‌యం అయితే.. తీసుకున్నారు కానీ, ఎవ‌రు వ‌స్తారు? ఎవ‌రిని చేర్చుకోవాలి? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014-2019 మ‌ధ్య ప‌వ‌న్ అంటే..ఉన్న ఇమేజ్ వేరు. ఆయ‌న పార్టీపైనా..ఎంతో అభిమానం.. ఎన్నో వ్యూహాలు ఉన్నాయ‌ని అనుకున్నారు. ఆయ‌న ప్ర‌సంగాల‌తో ఉత్తేజితులు అయిన‌వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇది .. మేధావులు అంటున్న మాట‌. అందుకే.. గ‌డిచిన మూడేళ్ల కాలంలో అనేక మంది మేధావులు.. మాజీ ఉద్యోగులు కూడా.. పార్టీకి దూర‌మ‌య్యారు.

ఇక‌, ఇప్పుడు కూడా ఒక వ్యూహం లేకుండానే జ‌న‌సేన రాజ‌కీయ అడుగులు వేస్తోంద‌న్న‌ది మేధావుల మాట‌. ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని.. ముందుకు సాగితే.. జ‌న‌సేన‌తో క‌లిసి అడుగులు వేసేందుకు కొంద‌రు సిద్ధంగానే ఉన్నారు.కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఎలాంటి వ్యూహం లేద‌నేది వారి మాట‌. వైసీపీ వ్య‌తిరేక‌త ఓటు బ్యాంకు చీలిపోకుండా.. చూస్తాన‌ని మాత్ర‌మే ప‌వ‌న్ చెప్పారు త‌ప్ప‌.. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తామ‌నేది మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు.

పోనీ.. బీజేపీతో పొత్తును కొన‌సాగిస్తారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డంలేదు. టీడీపీతో మ‌ళ్లీ చెలిమి చేస్తారా? అంటే.. దీనిపైనా క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో జ‌న‌సేన వైపు చూసే మేధావులు.. ఉన్న‌త వ‌ర్గాలు నానాటికీ త‌గ్గిపోతున్నాయని అంటున్నారు. నిజానికి ఇప్పుడు.. ఏపీలో ఏర్ప‌డిన రాజకీయ శూన్య‌త‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ చేయ‌డం లేద‌న్న‌ది.. వారి వాద‌న‌. అందుకే.. ఆపార్టీ చేర్చుకోవాల‌ని అనుకుంటున్నా.. వ‌చ్చి చేరేందుకు.. జై కొట్టేందుకు మేధావులు రెడీ గా లేర‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది.