ఇద్దరికీ ఇగో సమస్య తప్ప మరేంలేదా ?

చాలా చిన్న విషయమే చిలికిచిలికి గాలివానలాగ మారింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. అలాగే నిర్వాహకులు ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావుతో ప్రవచనాలు కూడా ఏర్పాటుచేశారు. చిరంజీవికన్నా గరికపాటి ముందే వచ్చిన తన ప్రవచనాలను మొదలుపెట్టారు.

తర్వాతెప్పుడో చిరంజీవి కూడా కార్యక్రమంలో జాయినయ్యారు. ఎప్పుడైతే మెగాస్టార్ వచ్చారో వెంటనే జనాల దృష్టంతా ప్రవచనం మీదనుండి చిరంజీవి వైపు మళ్ళింది. దాంతో గిరికపాటి ఇగో బాగా హర్టయ్యింది. చిరంజీవి రాగానే అభిమానులు ఇతర జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చిరంజీవి కూడా ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. సెల్పీల కారణంగా ప్రవచనం కార్యక్రమం బాగా దెబ్బతినేసింది. దాంతో హర్టయిన గరికపాటి వెంటనే చిరంజీవిని ఉద్దేశించి సెల్ఫీల కార్యక్రమాన్ని ముగించేయాలని కోరారు. సెల్పీల కార్యక్రమాన్ని ముగించకపోతే తాను ప్రసంగాన్ని నిలిపేసి వెళ్ళిపోతానని బెదిరించారు.

ఆ తర్వాత చిరంజీవి కూడా స్టేజీమీదకు వచ్చి గరికపాటి పక్కకు వచ్చి కూర్చున్నారు. ప్రోగ్రామ్ డిస్ట్రబ్ అయినందుకు క్షమించమని కూడా అడిగారు. సీన్ కట్ చేస్తే గరికపాటి బెదిరింపులపై చిరంజీవి సోదరుడు నాగబాబు తొందరపడి ట్విట్టర్లో స్పందించారు. ఇదే సమయంలో గరికపాటి బెదింపులు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. దాంతో చిరంజీవి అభిమాన సంఘాలు గరికపాటి మీద రెచ్చిపోతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే చిరంజీవి లాంటి ప్రముఖులు వచ్చినపుడు కచ్చితంగా ప్రోగ్రామ్ డిస్ట్రబ్ అవుతుంది. చిరంజీవి, గరికపాటిని ఒకే చోటకు చేరిస్తే గరికపాటిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న గ్లామర్ అలాంటిది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే చిరంజీవికన్నా తాను ఎందులో తక్కువనే అహం గరికపాటిలో మొదలైనట్లుంది. అందుకనే సెల్ఫీ కార్యక్రమాన్ని నిలపకపోతే తాను వెళిపోతాననే బెదిరింపులకు దిగారు. ప్రోగ్రామ్ మధ్యలోనే వెళిపోతే గరికపాటిదే తప్పవుతుంది కానీ చిరంజీవిది కాదు. గరికపాటి అయినా చిరంజీవి అయినా తమ రంగాల్లో గొప్పొళ్ళే అనటంలో సందేహంలేదు. కాకపోతే గరికపాటి పద్మశ్రీ పురస్కర గ్రహిత. ఇదే సమయంలో చిరంజీవి పద్మభూషణ్ గ్రహీత. పైగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది హర్యానా గవర్నర్. తనకన్నా పెద్ద స్ధాయిలో ఉన్న ఇద్దరు ప్రముఖులు హాజరైన ప్రోగ్రామ్ నుండి వెళిపోతానని గరికపాటి బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది.