అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది కేసీయార్ ?

కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళదాం అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లోకి. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటంలో తప్పులేదు కానీ సీమాంధ్రులంటూ నానా గోల చేసే వాళ్ళు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు జేఏసీ ఛైర్మన్ గా పనిచేసిన కోదండరామ్ మరికొందరు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

అప్పటివరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళల్లో సీమాంధ్రులూ ఉన్నారు తెలంగాణా నేతలూ ఉన్నారు. కానీ తెలంగాణా డెవలప్ కాకపోవటానికి కేవలం సీమాంధ్ర ముఖ్యమంత్రులే కారణమంటూ నానా మాటలన్నారు. మరి తెలంగాణా నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య లాంటి వాళ్ళూ సీఎంలయ్యారు. పదుల సంఖ్యలో కేంద్ర మంత్రులుగా, వందల మంది రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. మరి వీళ్ళ హయాంలో తెలంగాణా ఎందుకు అభివృద్ధి జరగలేదు ?

అంటే అభివృద్ధి జరగటం లేదా జరగకపోవటం అన్నది తెలంగాణా పాలకులు లేదా సీమాంధ్ర పాలకుల మీద లేదు. స్ధానిక ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రుల కమిట్మెంట్ మీద ఆధారపడుంది. కానీ ప్రత్యేక తెలంగాణా సాధన కోసం అప్పట్లో కేసీయార్ సీమాంధ్రుల మీద విషం చిమ్మారు. పాలకులను తిట్టడంతో సరిపెట్టుకోకుండా సీమాంధ్ర సంస్కృతి, ఆహారం విషయంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అవసరమున్నా లేకపోయినా సీమాంధ్రలంటు బూతులు తిట్టారు.

అప్పట్లో సీమాంధ్రులను ఇన్ని రకాలుగా అవమానించిన కేసీయార్ ఇపుడు అదే సీమాంధ్రలో తన పార్టీ కోసం ఏ విధంగా పర్యటిస్తారు ? ఎన్నికలు వచ్చినపుడు తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లేయమని ఏ విధంగా అడగ్గలరు ? అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది ? రాష్ట్రం విడిపోయి రెండు ఎన్నికలు జరిగినా ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదంటే అందుకు కేసీయారే కారణమని సీమాంధ్ర జనాలు నమ్ముతున్నారు. మరీ ప్రశ్నలకు కేసీయార్ సమాధానం చెబుతారా ?