ఇంట గెలిచేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ రచ్చ?

దసరా నాడు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ పై కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన కేసీఆర్…రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయకుండా…జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడితే టీఆర్ఎస్ బలహీన పడి ఓటమి పాలయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారు.

అలా కాకుండా, ముందు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసి, అందులో గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెడితే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ మాటకు చెల్లుబాటు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా, సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని పరిస్థితులు వస్తే..అపుడు జాతీయ రాజకీయాలలో కేసీఆర్ కు పట్టు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ విషయాలన్నీ కేసీఆర్ కు తెలియవా? అంత అనాలోచితంగా కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకొని ఉంటారా? కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత ఏ వ్యూహం లేకుండానే మోడీతో ఢీకి రెడీ అవుతారా? అన్న ప్రశ్నలు కొందరు తెలంగాణ నేతల మదిలో మెదులుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడం వెనుక కేసీఆర్ అసలు ప్లాన్ ఇదేనంటూ సరికొత్త ప్రచారం మొదలైంది.

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే కేసీఆర్…జాతీయ పార్టీ పాట పాడుతున్నారు. ఢిల్లీ గద్దెపై కూర్చునేందుకు తెలంగాణ బిడ్డ కేసీఆర్ పోరాడుతున్నారని, అటువంటి కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడిస్తారా? అనే నినాదంతో కేసీఆర్ ముందుకు పోబోతున్నారట. బలమైన మోడీకి ఎదురువెళ్తున్న తనకు ప్రజలు మద్దతివ్వరా అన్న సెంటిమెంట్ తో కేసీఆర్ కొట్టబోతున్నారట.

తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే తెలంగాణ పరువు పోయినట్లేనని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన తెలంగాణ బిడ్డను సొంత రాష్ట్రంలో ఓడిస్తారా అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లబోతున్నారట. పదేళ్ల పాలనలో ప్రజల్లో కొద్దోగొప్పో వ్యతిరేకత ఉందన్న విషయం గ్రహించిన కేసీఆర్…ఇలా జాతీయ పార్టీ ఎత్తుగడతో ప్రజల్లోకి వెళితే…రాష్ట్ర సమస్యలను ప్రజలు పట్టించుకోరన్న భావనలో కేసీఆర్ ఉన్నారట. ఈ నేషనల్ ప్లాన్ లో కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.