మూడు రాజ‌ధానులు కాదు.. ఏపీని మూడు రాష్ట్రాలు చేయండి: జ‌గ్గారెడ్డి

ఏపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. త‌న విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. సోమ‌వారం.. ఆయ‌న హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై తీవ్రంగా స్పందించారు. సీఎం జ‌గ‌న్‌..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ఫ్యాక్ష‌న్ అల‌వాట్లు నిర్ణ‌యాలు మార్చుకోవ‌డం లేద‌ని.. దుయ్య‌బ‌ట్టారు. పేరు మార్పు స‌రికాద‌న్నారు. రేపు వ‌చ్చే ప్ర‌భుత్వం.. వైఎస్ పేరు తీసేస్తే.. అది ఆయ‌న‌కు అవ‌మానం కాదా అని ప్ర‌శ్నించారు.

తాజాగా మంగ‌ళ‌వారం కూడా.. జ‌గ్గారెడ్డి.. ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై విరుచుకుప‌డ్డారు. మూడు రాజ‌ధానులు ఎందుకు.. ఏకంగా.. ఏపీని మూడు ముక్క‌లు చేసి.. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే.. జ‌గ‌న్ , ఆయ‌న సోద‌రి.. ఆయ‌న స‌న్నిహితుడు.. విజ‌యసాయిరెడ్డిలు ముఖ్య‌మంత్రులుగా చ‌క్రాలు తిప్పొచ్చ‌ని.. స‌టైర్లు రువ్వారు. దీంతో కుటుంబంలో నెల‌కొన్న రాజ‌కీయ వివాదం కూడా స‌మ‌సిపోతుంద‌న్నారు. త‌న కుటుంబ వివాదాన్ని తెలంగాణ‌కు తీసుకువ‌చ్చిన ష‌ర్మిల ఏదైనా ఉంటే.. ప్ర‌ధాని మోడీతో మాట్లాడి చ‌ర్చించుకుని.. ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ష‌ర్మిల‌పై జ‌గ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ‘నన్ను వ్యభిచారి అంటావా? బుద్ది ఉందా నీకు..?’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని.. కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్‌ లో ఉన్నప్పుడే పులిని అని పేర్కొన్నారు. వైఎస్‌తో ఉన్నప్పుడు పులి, ఇప్పుడు పిల్లిలా ఉన్నా అనే షర్మిల మాట అబద్ధమన్నారు. తాను టీఆర్ఎస్‌లో ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో తనను కట్టడి చేయడానికి పోలీస్‌ను ఉపయోగించారన్నారు.

పోలీస్‌లు లిమిట్ క్రాస్ చేయడంతో అప్పట్లో తాను రిగ్గింగ్ చేశానన్నారు. తన స్టైల్ నచ్చి వైఎస్ పిలిచారని… అభివృద్ధి కోసం ఆనాడు వెళ్ళానన్నారు. ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దు. షర్మిల పెద్ద మోతుబరి కాదు… అసలు ఆమె పంచాయితీ ఏంటో తెలియడం లేదు. ఆమె పాదయాత్ర ఎందుకు చేస్తుందనేది క్వశ్చన్ మార్క్. నన్ను కేటీఆర్ కోవర్ట్ అనడం దురదృష్టకరం. షర్మిల సీఎం కావాలనేది ఆమె కోరిక అని.. ఆమె తల్లి కూడా అదే చెప్పారు” అని వ్యాఖ్యానించారు.

షర్మిల ఏపీలో ఎందుకు తిరగడం లేదన్నారు. జగన్‌కు చెప్పి షర్మిలను ఏపీ సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నాన‌న్నారు. “మీ కుటుంబ సభ్యులంతా సీఎంలుగా ఉండాలనేది మీ కోరిక. మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా? వైయస్ బిడ్డ అని మిమ్మల్ని ఎవరు తిట్టలేక పోతున్నారు. షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ” అని జ‌గ్గారెడ్డి నిప్పులు చెరిగారు.