వైఎస్ జయంతి నాడు… బాబుకు జగన్ షాక్?

2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టగా…23 మంది ఎమ్మెల్యేలతో మాజీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. ఆ తర్వాత పరిణామాల మధ్య టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి…పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలైన ఈ ముగ్గురిపై టీడీపీకి ఏమాత్రం హక్కులేదు. ఇక, తాజాగా ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణి, పోతుల సునీత…వైసీపీకి మద్దతిచ్చారు.

ఈ నేపథ్యంలోనే మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు వైఎస్సార్ జయంతి అయిన జులై 8ని జగన్ ముహూర్తంగా ఫిక్స్ చేశారని టాక్ వస్తోంది. వైఎస్ జయంతినాడు బాబుకు జగన్ షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

మరి కొద్ది రోజుల్లో టీడీపీని వీడేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు పార్టీని వీడతారని చాాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, శాసనమండలిలో బలం పెంచుకోవాలని వైసీపీ భావిస్తోందట. అందుకే టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారట.

డొక్కా, శమంతకమణి, పోతుల సునీత తరహాలోనే జులై 8వతేదీన మరో ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు కూడా వారితో పాటు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. వైఎస్ జయంతి నాడు చంద్రబాబుకు షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంపై అప్రమత్తమైన బాబు వీరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.