డైవ‌ర్ట్ చెయ్యాలంటే జ‌గ‌న్ త‌ర్వాతే..

ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక పెద్ద వివాదం ఏదో న‌డుస్తుంటుంది. ఓవైపు మీడియా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ముప్పేట దాడితో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డిఫెన్స్ ఉండ‌దు. జ‌నాల్లోకి చెడు సంకేతాలు వెళ్తున్న‌ట్లు, త‌మ‌కు డ్యామేజ్ జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అప్పుడే ఇంకో ఒక కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెస్తుంది ప్ర‌భుత్వం. అంద‌రి దృష్టి అటు మ‌ళ్లుతుంది. అంతే.. అప్ప‌టిదాకా హాట్ టాపిక్‌గా ఉన్న అంశం మ‌రుగున ప‌డిపోతుంది.

కొత్త వివాదం వ‌ల్ల కూడా కొంచెం క‌ష్టం ఉన్న‌ట్లు అనిపించినా.. ఎక్కువ డ్యామేజ్ జ‌రిగే పాత వ్య‌వహారం మ‌రుగున ప‌డినందుకు ఊపిరి పీల్చుకుంటుంది ప్ర‌భుత్వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన కొంత కాలం నుంచి జ‌రుగుతున్న తంతు ఇది. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ విష‌యంలో త‌మ‌ను మించిన వారు లేరు అన్న‌ట్లుగా జ‌గ‌న్ అండ్ కో వేస్తున్న ఎత్తుగ‌డ‌లు చూస్తే ఎవ్వ‌రైనా విస్తుబోవాల్సిందే.

తాజాగా అమ‌రావ‌తి వ్య‌వ‌హారం మీద ఇటు అసెంబ్లీలో, అటు మీడియాలో పెద్ద ర‌చ్చ జ‌రుగుతుండ‌గా.. త‌మ స్టాండ్‌ను బ‌లంగా చెప్పలేక ఇబ్బంది ప‌డింది వైసీపీ ప్ర‌భుత్వం. దీనికి తోడు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం కూడా వైసీపీ స‌ర్కారు మెడకు చుట్టుకోవ‌డంతో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఐతే ఈ రెండు వివాదాలు ఒక్క రోజులో ప‌క్క‌కు వెళ్లిపోయాయి.

విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ వైద్య విశ్వ‌విద్యాల‌యానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు పెట్టే దిశ‌గా బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డంతో అందరి దృష్టి అటు మ‌ళ్లింది. ప్రతిప‌క్షాలు, మీడియా అంద‌రూ దాని మీద గొడ‌వ చేయ‌డం మొద‌లుపెట్టారు. సామాజిక మాధ్య‌మాల్లోనూ దాని మీదే విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో అమ‌రావ‌తి, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారాల నుంచి అంద‌రినీ డైవ‌ర్ట్ చేయ‌డంలో జ‌గ‌న్ అండ్ కో గొప్ప విజ‌యం సాధించార‌నే చెప్పాలి. కాక‌పోతే ఎన్టీఆర్ పేరు మార్పు వ్య‌వ‌హారంతో జ‌రిగే డ్యామేజీ ఎంత అన్న‌ది కూడా కాస్త చూసుకుంటే బెట‌రేమో.