వివేకా కేసు: సుప్రీం ఎంటర్ అయ్యిందిగా..

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచ‌ల‌న‌మైన మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ఏపీ హైకోర్టు ప్ర‌త్యేకంగా దీనిని ప‌ర్య‌వేక్షిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత పేర్కొన్నారు.

కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డాక్ట‌ర్‌ సునీత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసి.. తదుపరి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టులో వైఎస్‌ సునీత పిటిషన్‌ వేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టింది.

సునీత లేవనెత్తిన అంశాలపై… సమాధానం చెప్పాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 14న చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సునీత తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా వాదనలు వినిపించారు. విచారణ సాగకుండా… దర్యాప్తు సంస్థ అధికారులు, సాక్షులను బెదిరిస్తున్నారని ధర్మాసనానికి సిద్దార్థ వెల్లడించారు. విచారణను తెలంగాణ హైకోర్టు పరిధిలోని ట్రయల్‌ కోర్టుకు మార్చాలని సునీతా రెడ్డి త‌ర‌పున ఆయ‌న సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.