KCR: తెలంగాణ‌పై విషం చిమ్ముతున్నారు

Telangana ప్ర‌భుత్వం.. అధికారికంగా నిర్వ‌హిస్తున్న జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు .. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వ‌హించిన వ‌జ్రో త్సవాల్లో.. సీఎం కేసీఆర్‌.. పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మ‌రోసారి ప‌రోక్షంగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్‌ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో దేశం, రాష్ట్రంలో పేట్రోగిపోతున్న మతోన్మాదశక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు విద్వేషపు మంటలు రగిలిస్తూ, విషవ్యాఖ్యలతో తెలంగాణ‌లో ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలను తిప్పికొట్టాలని ముఖ్యంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తొలుత‌ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

1948 సెప్టెంబర్‌ 17న సువిశాల భారత్‌లో హైదరాబాద్‌ రాష్ట్రం విలీనమైందన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవని చెప్పారు. ఆనాడు స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్‌లో విలీనం అయ్యాయని, ఆనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందామ‌న్నారు. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని కేసీఆర్ చెప్పారు.

మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగిందని చెప్పిన కేసీఆర్‌… స్వాంతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేద‌న్నారు. రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ పేరిట హైదరాబాద్‌ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీతో కలిపారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనంపై హైదరాబాద్‌ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారని చెప్పారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింద‌ని కేసీఆర్ ఉద్ఘాటించారు.