కుప్పంపై జ‌గ‌న్ వ్యూహం.. ఏకంగా ఎన్ని కోట్లు ఇచ్చారంటే!

రాష్ట్రంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాలు వెనుక‌బ‌డి ఉన్నాయి. ఇక‌, రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువ‌గా ఉన్నాయి. చిన్న‌పాటి వైద్యానికి కూడా నోచ‌ని తండాలు.. ప్రాంతాలు మ‌న రాష్ట్రంలో కోకొల్ల‌లు. అర‌కు, పాడేరు.. వంటి గిరిజ‌న ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఏదైనా అత్య‌వ‌స‌ర వైద్యం అవ‌స‌ర‌మైతే.. డోలీలు క‌ట్టుకుని.. మ‌రీ ఏరియా ఆసుప‌త్రుల‌కు తీసుకువ‌స్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ‌ర్భిణుల‌కు స‌రైన స‌మ‌యానికి వైద్యం అంద‌క‌.. మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ప‌రిస్థితి కూడా ఉంది.

ఇది ఒక్క‌టే కాదు.. అనేక ప్రాంతాల్లో క‌నీస మౌలిక స‌దుపాయాలు కూడా లేవు. రోడ్లు విద్యుత్ వంటివి క‌నిపించ‌డం లేదు. ఇలా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలా ఉంది. కానీ, ఏపీ ప్ర‌భుత్వానికి ఇవేవీ క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం ఇప్పుడు వైసీపీ స‌ర్కారుకు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఎందుకంటే.. గ‌త కొన్నాళ్లుగా ఇక్క‌డే వైసీపీ దృష్టి పెట్టింది.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కుప్పం ను మినీ మునిసిపాలిటీ చేసింది. ఇది మంచిదేకానీ.. త‌మ ప్రాంతాన్ని మునిసిపాలిటీ చేయాల‌ని కోరుతున్న అనేక ప్రాంతాల‌ను మాత్రం వ‌దిలివేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కుప్పం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో బ‌ల ప్ర‌యోగం చేసి.. వైసీపీ ఇక్కడ పాగా వేసింద‌ని.. టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు.. సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ ప‌ర్య‌టించడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఆయ‌నేమీ ఉత్తుత్తి ప‌ర్య‌ట‌న చేయ‌డం లేదు. చాలా ప్లాన్‌తోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఏకంగా 66 కోట్ల రూపాయ‌ల‌ను కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై సీఎం జ‌గ‌న్ కుమ్మ‌రించారు. వివిధ అభివృద్ధిప‌నుల‌కు వీటిని వెచ్చించ‌నున్నారు. వాస్త‌వానికి..చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్ప‌డే.. ఇక్క‌డ అనేక అభివృద్ధి ప‌నులు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ త‌న‌దైన ముద్ర వేయాల‌నే త‌ప‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ జెండా ఎగ‌రాల‌నే వ్యూహంతో ఇప్పుడు ఇక్క‌డ పెద్ద‌గా ప‌నులు చేయాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా.. 66 కోట్లు కేటాయించార‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి.

ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌తో కాద‌ని.. వారు ఆక్షేపిస్తున్నారు. నిజ‌మైన అవ‌స‌రం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు చిత్తూరులోనే చాలా ఉన్నాయ‌ని, అయితే.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. కుప్పంపైనే క‌న్నేయ‌డం వెనుక‌..రాజ‌కీయ వ్యూహం త‌ప్ప‌.. మ‌రొకటి కాద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు.