చంద్ర‌బాబు ఆస్తుల‌పై మీకేంటి అంత ఆస‌క్తి?: సుప్రీం ఫైర్‌

ఉమ్మ‌డి ఏపీనే కాకుండా.. నవ్యాంధ్ర మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఆస్తుల‌కు సంబంధించి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీం కోర్టు ఆస‌క్తిగా స్పందించింది. “చంద్ర‌బాబు ఆస్తుల‌గురించి మీకెందుకు ఆస‌క్తి? అస‌లు మీకు ఎందుకు చెప్పాలి?” అని నిల‌దీసింది. అంతేకాదు.. ఎవ‌రెవ‌రో .. సంపాయించుకున్న ఆస్తుల వివ‌రాలు తెలుసుకుని.. మీరు ఏంచేయాల‌ని అనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించింది. ఇవ‌న్నీ కూడా.. వైసీపీ నాయ‌కురాలు.. ప్ర‌స్తుత తెలుగు అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌.. ల‌క్ష్మీపార్వ‌తి గురించే.

త‌ర‌చుగా చంద్ర‌బాబును మా అల్లుడు.. అంటూ.. సంబోధిస్తూనే విమ‌ర్శ‌లు గుప్పించే ల‌క్ష్మీపార్వ‌తికి.. మ‌రోసారి చంద్ర‌బాబు పేరు ఎత్తుకుండా.. సుప్రీంకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. చంద్ర‌బాబు ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న స‌మ‌యంలో భారీ ఎత్తున ఆస్తులు పోగేసుకున్నార‌ని.. ఆరోపిస్తూ.. లక్ష్మీపార్వ‌తి .. హైకోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. సుదీర్థ విచార‌ణ త‌ర్వాత‌.. ఈ కేసును హైకోర్టు తోసిపుచ్చింది. అయినా.. ప‌ట్టు వీడ‌కుండా.. ఆమె సుప్రీంకు వెళ్లారు.

అయితే.. సుప్రీంకోర్టులో కూడా లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు, వివరాలు వెల్ల‌డించేందుకు కూడా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీపార్వ‌తికి దిమ్మ తిరిగేలా.. సుప్రీం కోర్టు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణిని అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

ఎన్టీఆర్ సతీమణి అనేది అదనపు అర్హత అవుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని గ‌ద్దించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే పిటిషన్ కొట్టివేసిందని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పేర్కొంటూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.