నిజామాబాద్ నుంచే జాతీయ రాజ‌కీయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో మోడీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోడీ చేస్తున్న ఏకైక పని అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఆర్ ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఆ తరువాత గిరిరాజ్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని.. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైతులకు ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోడీ చెప్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. బావి కాడ మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలన్నారు. 2024లో బీజేపీ ముక్త్‌ భారత్‌ ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలన్న ఆయన.. తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.

8 ఏళ్ల పాలనలో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందన్న సీఎం కేసీఆర్.. రైతుల భూములు తీసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోడీ చేస్తున్న ఏకైక పని అని ధ్వజమెత్తారు.