మంత్రి గారి దూకుడుతో న‌ష్ట‌మెంత.. వైసీపీ లెక్క‌లు ఇవే!

ఆయ‌న తొలిసారి మంత్రి అయిన‌.. సీనియ‌ర్ నాయ‌కుడు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌నే దేవ‌దాయ శాఖ మంత్రి.. కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌. ఇప్పుడు ఆయ‌న ప‌నిచేస్తున్నార‌నే వాద‌న ఒక‌వైపు వినిపిస్తున్నా.. పంటి కింద రాయిలా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం.. దేవదాయ శాఖ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాలేన‌ని చెబుతున్నారు ఉద్యోగులు. ఒక‌ప్పుడు ఈ శాఖ అంటే.. దేవుడు.. భ‌క్తి అనే మాట వినిపించేది.

అయితే.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. దేవ‌దాయ శాఖ అంటే.. అవినీతి.. దోచుకోవ‌డం.. దొడ్డిదారి.. అనే మూడు మాటలే వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు ఉద్యోగులు. అది కూడా భ‌క్తుల‌ను దోచుకోవ‌డం.. ప‌క్క‌న పెడితే.. ఉద్యోగుల‌ను పై ఉన్న‌తాధికారులు దోచుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల రాష్ట్రంలో ఆల‌యాల్లో ఈవోల ట్రాన్స్‌ఫ‌ర్లు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంలో ఒక కీల‌క అధికారి.. అందునా.. దేవాదాయ శాఖ హెడ్డాఫీసులో ఉన్న అధికారి చ‌క్రం తిప్పి.. ఉద్యోగుల నుంచి ల‌క్ష‌లు గుంచార‌నే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే..దీనిని ప‌ట్టించుకోవాల్సిన మంత్రి కొట్టు మాత్రం మౌనంగా ఉన్నారు.

ఇదిలావుంటే.. గ‌త మంత్రి తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఈయ‌న ప‌ట్టించుకోవ‌డంలేద‌నే మ‌రో ఆరోప‌ణ బాహాటంగానే వినిపిస్తోంది. గ‌తంలో మంత్రి గా వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు వ్య‌వ‌హ‌రించారు. ఈయ‌న నాయి బ్రాహ్మ‌ణుల‌కు గౌర‌వ వేతనం అందించేందుకు కృషి చేశారు. ఈ విష‌యంలో ఆయ‌న‌నువారు కూడా మెచ్చుకున్నారు. క‌నీసం 10 వేల చొప్పున గౌర‌వ వేతనం ఉండేలా.. చ‌ర్య‌లు తీసుకున్నారు.

పెద్ద ఆల‌యాలైతే.. 10 వేలు.. చిన్నాల‌యాలైతే.. రూ.5 వేలు చొప్పున గౌర‌వ వేతనం వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే.. ఈ ఫైల్ రెడీ అయ్యాక‌.. ఆయ‌న ప‌ద‌వి కోల్పోయారు. మ‌రి ఆ త‌ర్వాత‌.. వ‌చ్చిన మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ దీనిని ప‌ట్టించుకుని ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆయ‌న మాత్రం గ‌త మంత్రి తీసుకున్న నిర్ణ‌యం.. నాది కాదు.. అని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. దీంతో నాయీ బ్రాహ్మ‌ణులు తిర‌గ‌బ‌డుతున్న ప‌రిస్థితి వ‌చ్చింది.

గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వంపైనా.. వీరు తిర‌గ‌బ‌డ్డారు. త‌మ షాపుల‌కు వ‌చ్చేవారికి.. టీడీపీకి వ్య‌తిరేకంగా .. అంత‌ర్గ‌త ప్ర‌చారం చేశారు. మ‌రి ఇప్పుడైనా.. ఈ ప‌రిస్థితి పోవాలంటే.. వైసీపీ త‌మ‌కు న్యాయం చేస్తుంద‌ని భావిస్తున్న నాయీల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం మంత్రిపైనే ఉంద‌ని వారు చెబుతున్నారు. కానీ, ఆయ‌న మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ అతి త‌క్కువ కాలంలోనే వివాద‌మ‌వుతున్నారు.