కేసీఆర్.. 90 రోజుల టెన్షన్

కేసీఆర్ కొత్తగా 90 రోజుల టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ 90 రోజుల టెన్షన్ ఏమిటంటే దసరా పండుగకు కొత్త సచివాలయాన్ని ప్రారంభించేయాలని జ్యోతిష్కులు చెప్పారట. అంటే ఆ తర్వాత మరికొన్ని విషయాలను కూడా చెప్పారు కానీ ముందు దసరాకు కొత్త సచివాలయం ప్రారంభం కావటం చాలా కీలకం. తర్వాత చెప్పిన విషయాలు ఏమిటంటే కొత్త సచివాలయం నుండి 90 రోజులు పరిపాలన చేయాలట.

90 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్ కు తిరుగుండదని జ్యోతిష్కులు చెప్పారట. 90 రోజుల పరిపాలన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం అన్నది చాలా కీలకం. ఎందుకంటే సచివాలయం నుండి పరిపాలన ప్రారంభించాలంటే ముందు భవనాల నిర్మాణాలు పూర్తవ్వాలి కదా. సచివాలయం పూర్తవ్వాలి, తర్వాత 90 రోజులు ఇక్కడే కూర్చుని పరిపాలించాలి. ఒకవైపు సచివాలయాల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి.

పనులు మెల్లిగా జరిగితే అదంతా ఎప్పుడు పూర్తయ్యేను, కేసీఆర్ 90 రోజుల పాలన సచివాలయం నుండి ఎలా సాగేను? ఎప్పుడైతే జ్యోతిష్కులు విషయం చెప్పారో వెంటనే కేసీయార్ అలర్టయ్యారట. నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పిలిచి విషయమంతా చెప్పారట. అన్ని పనులు పక్కనపెట్టేసి ముందు సచివాలయం పనులను మాత్రమే జరిపించాలని ఆదేశించారట. దాంతో ప్రశాంత్ కూడా ఇపుడిదే పనులపై చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం.

దసరా పండుగ కేమో ఉన్నది నెల రోజుల వ్యవధి మాత్రమే. అక్టోబర్ 5వ తేదీ విజయదశమి అన్న విషయం తెలిసిందే. అప్పటికి పనులు పూర్తి కాకపోతే ఇపుడుపడుతున్న శ్రమంతా వృధాయే. అందుకనే ముందుగా ముఖ్యమంత్రి కూర్చునే బ్లాకును రెడీ చేయాలని మంత్రి నిర్మాణ పనులను చూస్తున్న కాంట్రాక్టు సంస్ధకు చెప్పారట. కొత్త సచివాలయం ఆరో అంతస్తులో కేసీఆర్ ఛాంబర్ ఉంటుందట. అందుకనే ముందు కేసీఆర్ ఛాంబర్ ను పూర్తిచేసే విషయంపైన కూడా మంత్రి దృష్టిపెట్టారట. అంటే జ్యోతిష్యులు చెప్పిన ప్రకారమైతే మార్చిలో ముందస్తు ఎన్నికలకు వెళతారేమో చూడాలి.