ఇది టీఆర్ఎస్‌, బీజేపీ గేమ్ ప్లాన్‌: రేవంత్ ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌, బీజేపీల‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ రెండు పార్టీల గేమ్ ప్లాన్ అంద‌రికీ తెలుస‌ని.. అన్నారు. వ్యూహాత్మ‌కంగా..రెండూ వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్‌ ఎంపీలు సభకే హాజరుకాలేదని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ ఖర్చు చేస్తున్నారన్నారు. సెప్టెంబరు 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలో ఏఐసీసీ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కసరత్తు టీపీసీసీ స్థాయిలో పూర్తయిందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే రాజాసింగ్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నార‌ని ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్‌ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేత విమర్శించారు.

కవిత మీద బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ, మరి ఆమె ఇంటికి ఈడీ ఎందుకు వెళ్లడం లేదు. బీజేపీ బ్లాక్ మెయిల్ చేసి ప్రొటెక్షన్ మనీ సంపాదిస్తోంది. రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు.. మోడీ మోకాళ్ల యాత్ర చేస్తారా? బంగాల్‌ మోడల్ ఇక్కడ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో టీఆర్ఎస్‌, బీజేపీ డ్రామాలు చేస్తున్నాయి. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం లేదు. ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయి.. అని నిప్పులు చెరిగారు.