తెలంగాణ‌కు మ‌రోషాక్‌.. ఏపీ బాకీ చెల్లించాల‌ని కేంద్రం ఆదేశం

తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారుకు కేంద్రం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వ‌డ్డీతో సహా క‌లిపి మొత్తం 6,800 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయని పేర్కొంది.

దీనికి సంబంధించిన 3441.78 కోట్ల రూపాయల బకాయిలతో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది.  పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఆదేశాలు ఇస్తున్నామని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ అనూప్‌ సింగ్ బిస్త్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శికి లేఖ రాశారు. 

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ జెన్కో  నుంచి 2014 నుంచి 2017 వరకూ సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ డిస్కంలు బిల్లులు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. 2014 మార్చి 28న జరిగిన సమావేశంలో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటివరకూ రెండు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా తెలంగాణ చెల్లించలేదని తెలిపారు. 30 రోజుల్లోపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించారు.

తెలంగాణ జెన్కో సీఎండీ తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులకు ఈ కాపీలు పంపారు. ఇక‌, దీనిపై కేసీఆర్ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మ‌రోవైపు.. రెండు రోజుల కింద‌ట ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం వ‌ద్దకు వెళ్లి.. తెలంగాణ విద్యుత్ బ‌కాయిలు ఇప్పించాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఈ ప‌రిణామం.. ఇరు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కాక‌పుట్టించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.