దేశానికి 5 రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంటి

ప్రాంతీయ భేదం తలెత్తకుండా దేశానికి ఐదు రాజధానులు ఉండాలని అసోం సీఎం, బీజేపీ సీనియ‌ర్ నేత‌ హిమంత బిశ్వశర్మ ప్రతిపాదించారు. ప్రతి జోనుకు ఒకటి చొప్పున ఐదు రాజధానులు అవసరమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం సీఎం అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడుతున్న‌ప్పుడు… ఆయనకు పక్క రాష్ట్రాలను ఎగతాళి చేసే అలవాటు ఉందని తెలిపారు. రాష్ట్రాల మధ్య ఉన్న భేదాలను తొలగించడానికి, కొన్ని రాష్ట్రాలు వేరే రాష్ట్రాలను ఎగతాళి చేయకుండా ఉండేందుకు, భారత్ కు ఐదు రాజధానులు ఉంటే త‌ప్పేంట‌న్నారు.

అంతేకాదు.. ఇలా చేస్తే ఢిల్లీ లాంటి ప్రభుత్వాల వద్ద ఎక్కువ సంపద కేంద్రీకృతం కాకుండా ఉంటుంద‌న్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ ఉండకుండా ఉంటుందన్నారు. విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నామ‌ని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోందని తెలిపారు. ఈశాన్య భారతానికి ఎవరి జాలి అవసరం లేదన్న ఆయ‌న‌… గౌరవం, వనరులు, పునరుత్తేజం కావాల‌ని చెప్పారు.

ఇటీవల ఇరువురు అసోం, ఢిల్లీ ముఖ్యమంత్రులు ట్విట్టర్లో మాటల యుద్ధానికి దిగారు. అసోంలో పాఠశాలల విలీనం కారణంగా కొన్ని విద్యాసంస్థలు మూసేయాల్సి వస్తోందని కేజ్రీవాల్ అన్నారు. దానికి హిమంత బదులిస్తూ.. కేజ్రీవాల్ ఎ్పప్పటిలాగే హోం వర్క్ చేయకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఆయన, తాను ముఖ్యమంత్రి అయిననుంచి చేసిన మంచిని మరచిపోయారన్నారు. ఈ వ్యాఖ్యలకు బదులిస్తూ మనీశ్ సిసోడియా.. తాను అసోం ప్రభుత్వం చేసిన మంచి పనులను చూడాలనుకుంటున్నాను అని అన్నారు.

దానికి బదులిచ్చిన హిమంత.. ఇప్పటికే సిసోడియాకు కోర్టు సమ్మన్ల రూపంలో ఆహ్వానం పంపించామని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి హిమంత, కేజ్రీవాల్ మధ్య  వార్ కొనసాగుతోంది.  అసోం సీఎం స్పందిస్తూ.. కేజ్రీవాల్ ఢిల్లీని అసోం, ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న నగరాలతో పోల్చుతున్నారన్నారు. కానీ ఆయన మాత్రం ఢిల్లీని లండన్, పారిస్లా మర్చుతానని హామీ ఇచ్చి విఫలమయ్యాడని విమర్శించారు.