ఆంధ్రా అష్ట‌దిగ్బంధం.. కాలు క‌దిపితే నిఘా నేత్రం!

మ‌రొక్క రోజులో వినాయ‌చ‌వితి పండుగ. పిల్లాపాప‌ల‌తో అంద‌రూ ముచ్చ‌ట‌గా చేసుకునే తొలి పండుగ‌. ఇంటిల్లి పాదీ బ‌య‌ట‌కు వ‌చ్చి.. అంతో ఇంతో సంతోషంగా గ‌డిపే స‌మ‌యం. కానీ.. ఇది ఏపీ ప్ర‌జ‌ల‌కు దూరం కానుంది. ఎందుకంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పు డు పోలీసుల అష్ట‌దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. కాలు క‌దిపితే.. ఎవ‌రు ఉద్యోగో.. ఎవ‌రు సామాన్య పౌరులో తెలుసుకునేందుకు పోలీసులు వెంటాడేస్తున్నారు. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చే పౌరులు త‌మ గుర్తింపు ప‌త్రాల‌తో రావాల్సిన అనివార్య ప‌రిస్తితిని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఉద్యోగులు ఇచ్చిన సెప్టెంబ‌రు 1 సీఎం ఇంటిముట్ట‌డి పిలుపే!!

సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 న ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్షించారు. చలో విజయవాడకు ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి రాలేదు. ఉద్యోగులు విజయవాడ రాకుండా తీసుకుంటున్న చర్యలు, తనిఖీలు, ముందస్తు అరెస్టులు, నిఘా తదితర అంశాలను సీఎంకు వివరించారు. ఆంధ్రాని అష్ట‌దిగ్బంధం చేసిన‌ట్టు ఆయ‌న తెలిపార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పాయి.

మ‌రోవైపు సీఎం కూడా చ‌లో విజయవాడ ఉద్య‌మాన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి ప‌లు అంశాల‌తో దిశానిర్దేశం చేశారు. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతులు సహా భద్రతపై డీజీపీతో సీఎం చర్చించారు. ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై వివ‌రించాల‌ని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. పౌరులు పోలీసుల‌తో వివాదాల‌కు దిగ‌కుండా.. చేతిలో గుర్తింపు కార్డు పెట్టుకోవాల‌ని.. ప్ర‌జాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. లేక‌పోతే..ఊచ‌లు లెక్క‌పెట్ట‌డం.. కుటుంబాల‌కు పండ‌గ పూట క‌న్నీరు మిగ‌ల్చ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ప‌ట్టు వీడ‌ని ఉద్యోగులు

ఒక‌వైపు ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించి అష్ట‌దిగ్బంధం చేస్తున్నా.. ఉద్యోగులు ప‌ట్టు వీడ‌డం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చిన సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని శాంతియుత ప్రదర్శనకు పిలుపినిస్తే, అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇప్పటికే సీపీస్ రద్దుపై సంబంధిత మంత్రులతో చర్చలు జరిపిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అంధ్రప్రదేశ్లో సైతం అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీస్ విధానాన్ని రద్దు చేసి.. ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సంఘాల నేత‌లు తేల్చి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ భ‌యం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. పోలీసులు ప్ర‌తి ఒక్క‌రినీ అనుమాన‌పు చూపుల‌తో చూస్తుండ‌డం మ‌రింత దారుణంగా మారింది.